
తాజా వార్తలు
స్వేచ్ఛగా ఓటెయ్యండి: సీపీ సజ్జనార్
హైదరాబాద్: ప్రజలంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. కమిషనరేట్ పరిధిలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై మైలార్దేవ్పల్లి, రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ల సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలోని 38 మున్సిపాలిటీల్లో గల 2,569 పోలింగ్ స్టేషన్లలో డిసెంబరు 1వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి పోలీసు స్టేషన్ల పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించి అధికారులకు బందోబస్తు ఏర్పాట్లపై సూచనలు, సలహాలు ఇచ్చారు.
ఇప్పటికే గుర్తించిన 243 సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. పది ప్రాంతాల్లో సీసీటీవీ మౌంటెడ్ వెహికల్ కెమెరాలను ఏర్పాటు చేసి వీటిద్వారా ఎన్నికల వేళ జరిగే పరిణామాలను కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరవేస్తామన్నారు. సమస్మాత్మక పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా సైబరాబాద్లోని 38డివిజన్లకు గాను దాదాపుగా 13,500మంది పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. వీరితోపాటు డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు.