
తాజా వార్తలు
కరోనాపై అసత్య ప్రచారాలు వద్దు:ఈటల
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్పై వస్తున్న అసత్య ప్రచారాలతో ప్రజలు భయపడొద్దని.. స్వైన్ఫ్లూ సమయంలో తీసుకున్నట్లుగానే అన్ని విధాలుగా మందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి, ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ శంకర్, ఇతర వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఈటల సమావేశమయ్యారు. కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు కావాల్సిన ముందుస్తు చర్యలపై వారితో సమాలోచనలు జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయొద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ కేసులు నమోదైతే వైద్యం అందించేందుకు ఇప్పటికే గాంధీ, ఛాతి, ఫీవర్ ఆస్పత్రుల్లో కలిపి సుమారు 100 పడకలను సిద్ధం చేసినట్టు చెప్పారు. కరోనా లక్షణాలతో ఉన్నవారి రక్త నమూనాలను తరచూ పుణె పంపడం ఇబ్బందికరంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోనే పరీక్షలు చేసేందుకు కావాల్సిన కిట్స్ని సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. చైనాలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు సంబంధించి ఎప్పటికప్పుడు కేంద్రంతో చర్చిస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందన్న వార్తల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ వైద్యుల బృందం రాష్ట్రంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా మంగళవారం ఫీవర్ ఆస్పత్రిని సందర్శించిన వైద్యుల బృందం ఇవాళ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిని సందర్శించింది. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కరోనా, స్వైన్ఫ్లూ వార్డుల ల్యాబ్ను బృందం పరిశీలించింది. కరోనా వైరస్ అనుమానితులకు అందిస్తున్న చికిత్సపై బృందంలోని వైద్యులు ఆరా తీశారు. తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు, చికిత్స విధానంపై వైద్యులకు పలు సూచనలు చేశారు. వైరస్ వ్యాప్తి చెందుతోందన్న వార్తల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిందిగా వైద్యులకు బృందం సూచించింది.
50 పడకలతో తాత్కాలిక ఆస్పత్రి..
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో భాగంగా అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం వైద్య పరంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు మంత్రి ఈటల తెలిపారు. జాతరకు సుమారు 1.50 కోట్లకుపైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అక్కడ 50 పడకలతో తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. గతంలో జాతరకు వచ్చిన గర్భిణులకు ప్రసవం జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ప్రత్యేకంగా లేబర్ రూంలను ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉన్నందున సరిపడా మందులను ఇప్పటికే పంపిణీ చేశామని.. 24 గంటల పాటు వైద్యులను అందుబాటులో ఉంటారని ఈటల వివరించారు.
ఇవీ చదవండి..
రక్షించండి... వుహాన్లో భారతీయ విద్యార్థులు
పదిరోజుల్లో కరోనా మరింత తీవ్రరూపం
కరోనా ముప్పు.. ఈ జాగ్రత్తలు పాటించండి..