
తాజా వార్తలు
ఏపీలో 4 ఫిషింగ్ హార్బర్లకు శంకుస్థాపన
మరోనాలుగింటి కోసం ప్రయత్నిస్తున్నామన్న సీఎం జగన్
అమరావతి: ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో నాలుగు ఫిషింగ్ హార్బర్లు, 25 ఆక్వా హబ్లకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వర్చువల్ పద్ధతిలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచే కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ, గుంటూరు జిల్లాలోని నిజాంపేట, నెల్లూరు జువ్వలజిన్న హార్బర్లకు జగన్ శంకుస్థాపన చేశారు. మత్స్సకారుల జీవితాలు దయనీయ పరిస్థితుల్లో ఉండడాన్ని పాదయాత్రలో గమనించానని, అందుకే హార్బర్లు ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెల్లడించారు.
మత్స్యకారులకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్నీ నెరవేరుస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. రూ.1510 కోట్లతో నాలుగు ఫిషింగ్ హార్బర్లు చేస్తున్నామని, వీటికి డిసెంబర్ 15కల్లా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. మరోనాలుగు హార్బర్ల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్ల పాలెం, విశాఖలోని పూడిమడక, పశ్చిమగోదావరి జిల్లాలోని బియ్యపు తిప్ప, ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నంలో వీటిని ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.