
తాజా వార్తలు
జపాన్ ప్రధానితో మాట్లాడిన మోదీ
దిల్లీ: కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రపంచ దేశాధినేతలతో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుత ఆరోగ్య, ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిస్తున్నారు. దీనిలో భాగంగా జపాన్ ప్రధాని షింజో అబేతో మోదీ శుక్రవారం మాట్లాడారు. కొవిడ్-19 వల్ల ఉత్పన్నమయ్యే సవాళ్లను పరిష్కరించడంలో భారత్-జపాన్ భాగస్వామ్యం కీలకపాత్ర పోషిస్తుందని ఇరు దేశ ప్రధానులు ఆశాభావం వ్యక్తం చేశారు.
‘‘నా మిత్రుడు, జపాన్ ప్రధాని షింజో అబేతో చర్చలు ఫలప్రదంగా జరిగాయి. కొవిడ్-19పై విజయానంతరం మన ప్రజలకు, ఇండో-పసిఫిక్ ప్రాంతానికి, ప్రపంచానికి.. కొత్త సాంకేతికతలు, పరిష్కారాలకు భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యం సహాయపడుతుంది’’ అని మోదీ ట్వీట్ చేశారు. కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జపాన్ ఇటీవల అత్యవసర పరిస్థితిని ప్రకటించిన సంగతి తెలిసిందే.
అంతేకాక కరోనా కట్టడిపై నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీతో కూడా చర్చలు జరిపినట్లు మోదీ ట్వీట్ చేశారు. ‘‘కొవిడ్-19 వల్ల ఏర్పడిన పరిస్థితుల గురించి నేపాల్ ప్రధాని కేపీ శర్మతో చర్చించాను. క్లిష్ట పరిస్థితుల్లో దృఢసంకల్పంతో మహమ్మారిపై పోరాడుతున్న నేపాల్ ప్రజలను అభినందిస్తున్నాను. పోరాటంలో నేపాల్కు భారత్ అండగా నిలుస్తుంది’’ అని మోదీ ట్వీటారు.