
తాజా వార్తలు
ధోనీ గిఫ్ట్.. మురిసిన బట్లర్
ఇంటర్నెట్ డెస్క్: మహేంద్రసింగ్ ధోనీ జెర్సీని సొంతం చేసుకోవాలని ఎవరు కోరుకోరు చెప్పండి. అందుకు ప్రత్యర్థి క్రికెటర్లు సైతం మినహాయింపు కాదు. అబుదాబి వేదికగా సోమవారం రాత్రి రాజస్థాన్, చెన్నై మధ్య మ్యాచ్ జరిగింది. ధోనీ టీ20 లీగ్ కెరీర్లో ఇది 200వ మ్యాచ్. మరే ఆటగాడు ఇన్ని మ్యాచ్లు ఆడలేదు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ ఆటగాడు బట్లర్ దూకుడైన ఇన్నింగ్స్ ఆడి తన జట్టును గెలిపించాడు. అయితే.. బట్లర్కు ఈ మ్యాచ్ తన ఇన్నింగ్స్ కంటే మరో మధురమైన అనుభూతినిచ్చింది. అదే ధోనీ జెర్సీ. ఈ మ్యాచ్లో మహీ ధరించిన జెర్సీని మ్యాచ్ ముగియగానే బట్లర్కు బహుమతిగా ఇచ్చాడు. ఆ జెర్సీతో మురిసిపోతున్న బట్లర్ ఫొటోను రాజస్థాన్ యాజమాన్యం ట్విటర్లో పోస్టు చేసింది. ధోనీ అంటే తనకెంతో అభిమానం అని ఇంగ్లిష్ హిట్టర్ పలుమార్లు వెల్లడించిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేసింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ బ్యాట్స్మన్ బట్లర్ (70; 40బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. దీంతో చెన్నై 7 వికెట్ల తేడాతో ఓడింది. మరోవైపు రాజస్థాన్ మాత్రం తన ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. పది మ్యాచ్లాడి నాలుగో విజయం సాధించిన రాజస్థాన్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.