
తాజా వార్తలు
పెళ్లి మండపానికే కొవిడ్ రిపోర్ట్...!
క్వారంటైన్కి నవదంపతులు
పిథోడ్గఢ్(ఉత్తరాఖండ్): పెళ్లిపీటల మీద ఉన్న సమయంలోనే వరుడికి కరోనా పాజిటివ్ అని తెలిసిన ఘటన ఉత్తరాఖండ్లో చోటుచేసుకుంది. దీంతో నూతన దంపతులను క్వారంటైన్లో ఉంచగా, పెళ్లికి వచ్చిన వారందరికీ కొవిడ్ టెస్టులు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అధికారుల వివరాల ప్రకారం..
చంపావత్ జిల్లాలోని ఛేరా గ్రామానికి చెందిన ఓ యువకుడు దిల్లీలో ఉంటున్నాడు. అతనికి పెళ్లి నిశ్చయం కావడంలో రెండు రోజుల ముందే తన స్వగ్రామానికి బయలుదేరాడు. అయితే, ఇంటికి వస్తోన్న సమయంలో దగ్గరలోని చంపావత్ పట్టణంలో ఆ యువకుడు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాడు. నమూనాలు ఇచ్చి ఇంటికి వెళ్లిన యువకుడు పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయాడు. చివరకు పెళ్లివేడుక జరుగుతున్న సమయంలోనే అధికారులు కొవిడ్ రిపోర్టును నేరుగా మండపానికే తీసుకొచ్చారు. దీనిలో వరుడికి కొవిడ్ పాజిటివ్ తేలిన విషయాన్ని అధికారులు వారికి వెల్లడించారు. దీంతో ఆ వేడుకకు హాజరైనవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.
అయితే, కొవిడ్ నిబంధనల ప్రకారం, మిగిలిన వివాహ ఆచారాలను పూర్తిచేసిన అనంతరం నవదంపతులను క్వారంటైన్కు పంపిచారు అధికారులు. వివాహానికి హాజరైన గ్రామస్థులకు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని స్థానిక మండల తహసీల్దార్ పంకజ్ చందోలా వెల్లడించారు.