
తాజా వార్తలు
కరోనా స్ట్రెయిన్: మహారాష్ట్రలో కర్ఫ్యూ!
ముంబయి: యూకేలో కొత్తరకం కరోనా స్ట్రెయిన్ విజృంభిస్తున్న తరుణంలో.. అటు కేంద్రంతో పాటు, మహారాష్ట్ర సర్కారు కూడా అప్రమత్తమైంది. రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబయి సహా పలు ప్రధాన నగరాల్లో ఈ కర్ఫ్యూను అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ‘రాష్ట్ర రాజధాని ముంబయి సహా పలు ప్రధాన నగరాల్లో రాత్రి కర్ఫ్యూ ఉంటుంది. ఈ కర్ఫ్యూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు అమల్లో ఉంటుంది. ఈ పద్ధతి జనవరి 5 వరకు కొనసాగుతుంది. ఇతర యూరప్ దేశాల నుంచి వచ్చే వారు తప్పకుండా 14రోజుల క్వారంటైన్లో ఉండాలి’ అని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
కర్ణాటక ప్రభుత్వమూ అలెర్ట్
బ్రిటన్లో కొత్త కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఈ నెల 7 నుంచి రాష్ట్రంలో అడుగుపెట్టిన ప్రయాణికుల వివరాలు ఇవ్వాలని బెంగళూరు, మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలను కోరింది. బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయాలని ఆదేశించింది. బ్రిటన్ విమానాశ్రయాల నుంచి వచ్చిన వారికే కాకుండా, ఇతర దేశాల్లోని ఎయిర్పోర్టులను నుంచి ప్రయాణించిన వారికి కూడా పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి
బ్రిటన్ నుంచి భారత్కు విమానాల రద్దు