
తాజా వార్తలు
సొమ్ము మనది.. సోకు దిల్లీది: కేటీఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు మందుకు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. మైలార్దేవ్పల్లి డివిజన్లో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రశాంత వాతావరణం కారణంగానే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది ఏం లేదని చెప్పారు. ప్రజల ఖాతాల్లో డబ్బు వేస్తామని మాయమాటలు చెప్పారని మండిపడ్డారు. గుజరాత్ రాష్ట్రంలో వరదలు వస్తే రూ.500 కోట్లు ఇచ్చారని.. మరి తెలంగాణలో వరదలు వస్తే ఏం ఇచ్చారని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెరాస ఏం చేసిందో చెప్పి ఓట్లు అడుగుతున్నామని.. మరి భాజపా ఏం చేసిందో చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు.
‘‘హైదరాబాద్లో శాంతిభద్రతలకు ఢోకా లేదు. హైదరాబాద్ ప్రజలు ఎంతో ప్రశాంతంగా ఉన్నారు. ఆకలైతే రూ.5కే భోజనం పెట్టే అన్నపూర్ణ ఉంది. సుస్తి చేస్తే బస్తీ దవాఖానాలు ఉన్నాయి. ఆడపిల్లకి పెళ్లి చేస్తే కల్యాణలక్ష్మి, షాదీముబారక్.. ఇలా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం చేసేవి చెప్పాలంటే గంటల సమయం పడుతుంది. ఈ ఆరేళ్లలో మనం పన్నుల ద్వారా కేంద్రానికి రూ.2.72 లక్షల కోట్లు కడితే, తిరిగి రాష్ట్రానికి రూ.1.40లక్షల కోట్లు మాత్రమే ఇచ్చింది. సొమ్ము మనది.. సోకు దిల్లీది. ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఇది. గందరగోళానికి గురికావొద్దు. సరైన నాయకత్వాన్ని ఎన్నుకునే బాధ్యత మీపైనే ఉంది’’ అని కేటీఆర్ వివరించారు.