
తాజా వార్తలు
హైదరాబాద్కు మీరేం చేశారు?: తలసాని
హైదరాబాద్: ఎక్కడ చూసినా తెరాసకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని.. గ్రేటర్ ఎన్నికల్లో తెరాస 104 స్థానాల్లో విజయం సాధిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధి ఇప్పుడు ప్రజల మధ్య ఉందన్నారు.
నగరంలోనూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తలసాని చెప్పారు. రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, పార్కులు ఇలా చాలా అభివృద్ధి చేశామన్నారు. కరోనా, వరదల సమయంలో ప్రజలను ఆదుకుంది తెరాస ప్రభుత్వమేని చెప్పారు. నగరానికి వస్తున్న కేంద్రమంత్రులు హైదరాబాద్ అభివృద్ధిపై మాట్లాడకుండా తెరాసపైనే విమర్శలు చేస్తున్నారని తలసాని ఆరోపించారు. భాజపా, కాంగ్రెస్ పార్టీలు హైదరాబాద్కు ఏం చేశాయో చెప్పాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 1న జరగనున్న పోలింగ్లో తెరాస అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.