
తాజా వార్తలు
చిన్న అబద్ధం లాక్డౌన్కు దారితీసింది !
సిడ్నీ: పిజ్జా రెస్టారెంటు ఉద్యోగి చెప్పిన ఓ చిన్న అబద్ధం.. 17.5 లక్షలకు పైగా జనాభా ఉన్న ఓ రాష్ట్రం మొత్తం మూతపడటానికి కారణమయింది. సౌత్ ఆస్ట్రేలియా ప్రాంతం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. అసలు సంగతి తెలియటంతో ఆ రాష్ట్ర ప్రిమియర్.. లాక్డౌన్ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేశారు. ఓ వ్యక్తి విచక్షణా రహిత చర్య మొత్తం రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెట్టిందని ప్రిమియర్ స్టీవెన్ మార్షల్ ప్రకటించారు. ఆ వ్యక్తి అధికారులకు నిజాన్ని చెప్పి ఉంటే లాక్డౌన్ పరిస్థితి తలెత్తేదే కాదన్నారు.
వినియోగదారుడినంటూ..
అడిలైడ్లో విదేశీయులు స్వీయ నిర్బంధంలో ఉండే ఓ హోటల్ సహాయకుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తికి కరోనా సోకింది. దీనితో వివరాలను తెలుసుకునేందుకు అధికారులు వచ్చారు. వారికి తాను వుడ్విల్లె పిజ్జా బార్లో పిజ్జా కొనుగోలు చేసేందుకు వెళ్లానని అబద్ధం చెప్పాడు. అయితే అతడికి కరోనా ఎవరి వల్ల సోకిందో అర్థం కాక అధికారులు అయోమయానికి గురయ్యారు. అక్కడికి వచ్చిన వినియోగదారులందరికీ కరోనా సోకే అవకాశముందని ఆందోళన చెందారు. ఈ కేసును ట్రేస్ చేయడంలో విఫలం కావడంతో అధికారులు కఠిన ఆంక్షలతో కూడిన లాక్డౌన్ను అమలు చేశారు. ఈ నిర్బంధం ఆరురోజుల పాటు అమలులో ఉంటుందని తెలిపారు.
అయితే ఆ వ్యక్తి కొనుగోలుదారు కాదని.. పిజ్జా పార్లర్లో పార్ట్టైమ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడని అనంతరం వెల్లడైంది. అంతేకాకుండా అక్కడ పనిచేసే ఓ సెక్యూరిటీ గార్డు వల్ల అతనికి కొవిడ్ సోకిందని కూడా తెలిసింది. దీంతో ఊపిరి పీల్చుకున్న సౌత్ ఆస్ట్రేలియా ప్రభుత్వం.. లాక్డౌన్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీనితో అక్కడ లాక్డౌన్ మూడురోజుల ముందే అంటే శనివారం అర్ధరాత్రి ముగియనుంది.