
తాజా వార్తలు
రాష్ట్రపతి పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనార్థం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా మంగళవారం తిరుమలకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, కలెక్టర్ భరత్ గుప్తా, ఎస్పీ రమేశ్ రెడ్డి పరిశీలించారు. రాష్ట్రపతి బసచేసే పద్మావతి అతిథి గృహం, వరాహస్వామివారి ఆలయం, శ్రీవారి ఆలయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. కొవిడ్-19 ప్రొటోకాల్ పాటిస్తూ దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనే అధికారులకు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కనుమదారుల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతోపాటు డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్లతో తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్రపతి పర్యటనను పర్యవేక్షించే ప్రత్యేకాధికారులు కాన్వాయ్ ట్రయల్రన్ నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్ ఆయనకు స్వాగతం పలికి పర్యటనలో పాల్గొననున్నారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో శ్రీవారి దర్శనాన్ని కూడా దాదాపు 2 గంటలకు పైగా నిలిపివేయనున్నారు.