
తాజా వార్తలు
కరోనాతో మహిళా ఎమ్మెల్యే కన్నుమూత
ప్రధాని, లోక్సభ స్పీకర్ సంతాపం
జైపూర్ : దేశంలో కరోనా బారిన పడి మరణిస్తున్న ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా రాజస్థాన్లో భాజపా మహిళా ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరీ కరోనాతో పోరాడుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఆ రాష్ట్రంలో అక్టోబరు నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో ఆమెకు వైరస్ సోకింది. మరో ఎమ్మెల్యే రాజేంద్రతో పాటు ఎన్నికల బాధ్యురాలిగా నియమితులైన మహేశ్వరీ కరోనా బారిన పడ్డారు. ఈనెల మొదటి వారం నుంచి వైరస్తో తీవ్రంగా పోరాడిన ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందారు.
మహిళా ఎమ్మెల్యే మృతి పట్ల ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సంతాపం తెలిపారు. ఆ రాష్ట్ర అభివృద్ధిలో ఆమె ముఖ్య భూమిక పోషించారని కొనియాడారు. ఎమ్మెల్యే కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు. గత ఎన్నికల్లో రాజస్థాన్లోని రాజ్సమంద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కిరణ్ మహేశ్వరీ 2004లో ఉదయ్పూర్ నుంచి లోక్సభకు కూడా ఎన్నికయ్యారు.