
తాజా వార్తలు
సచిన్ పైలట్ భాజపాలో చేరడం లేదా?
జైపుర్: సొంత ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసిన రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్.. భాజపాలో చేరతారన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తల్ని ఆయన ఖండించినట్లు తెలుస్తోంది. భాజపాలో చేరేది లేదని తెలిపినట్లు సమాచారం. అలాగే నేడు భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డాతో కలవబోతున్నట్లు వస్తున్న వార్తల్ని కూడా పైలట్ ఖండించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు సైతం ధ్రువీకరించినట్లు కొన్ని జాతీయ మీడియా సంస్థల కథనాల ద్వారా తెలుస్తోంది. అయినప్పటికీ.. మరికాసేపట్లో జరగబోయే పార్టీ సీఎల్పీ సమావేశానికి సచిన్ హాజరుకాబోరని సమాచారం. మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలంతా సమావేశం నిమిత్తం సీఎం గహ్లోత్ నివాసానికి చేరుకున్నారు.
సొంత పార్టీ పెట్టనున్నారా..?
సచిన్ సీఎం పీఠంపై పట్టుబడుతున్నట్లు సమాచారం. దీనికి భాజపా అంగీకరించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సొంత పార్టీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తోంది. ‘ప్రగతిశీల కాంగ్రెస్’గా దానికి నామకరణం చేసే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి సీఎల్పీ సమావేశం తర్వాత అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలంతా సమావేశం నిమిత్తం సీఎం గహ్లోత్ నివాసానికి చేరుకున్నారు. రాత్రి వరకు సచిన్ వర్గంలో ఉన్నారని భావించిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా నేడు సమావేశానికి హాజరయ్యేందుకు జైపుర్ చేరుకోవడం గమనార్హం. తాజా పరిస్థితులపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి అవినాశ్ పాండే స్పందించారు. ప్రస్తుత పరిస్థితులు ఓ కొలిక్కి తెచ్చే బాధ్యతను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన భుజాలపై ఉంచినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీలో ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా.. తనతో చర్చించవచ్చన్నారు. ఇప్పటికే తాను సచిన్ పైలట్ను సంప్రదించేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. సందేశం కూడా పంపానన్నారు. కానీ, ఇప్పటి వరకు సచిన్ అందుబాటులోకి రాలేదన్నారు. పార్టీ ఆయన వాదనను వినడానికి సిద్ధంగా ఉందన్నారు. కానీ, ఎలాంటి క్రమశిక్షణారాహిత్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే మహేందర్ చౌదరి మాట్లాడుతూ.. తామంతా సీఎం గహ్లోత్ వెంటే ఉన్నామన్నారు. ప్రతిఒక్కరూ సీఎల్పీ సమావేశానికి హాజరుకానున్నారని తెలిపారు.