
తాజా వార్తలు
బ్రిటన్లో ఆంక్షలు: సింధు థాయ్ వెళ్లేనా?
దిల్లీ: ప్రయాణ ఆంక్షలు ఉన్నప్పటికీ ఇంగ్లాండ్ నుంచి థాయ్లాండ్కు వెళ్తానని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ధీమా వ్యక్తం చేసింది. బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై అక్కడ నిషేధమేమీ లేదని పేర్కొంది. జనవరి 3న ఆరంభమయ్యే థాయ్ ఓపెన్లో ఆడతానని తెలిపింది. కొత్తరకం కరోనా వైరస్ వెలుగుచూడటంతో బ్రిటన్లో లాక్డౌన్ విధించారు. ప్రయాణాలపై ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే.
కొంతకాలంగా పీవీ సింధు ఇంగ్లాండ్లో శిక్షణ పొందుతోంది. కరోనా వైరస్ ముప్పు వల్ల మార్చి నుంచి ప్రపంచవ్యాప్తంగా బ్యాడ్మింటన్ టోర్నీలేవీ జరగలేదు. వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్ ఉండటంతో మ్యాచ్ ప్రాక్టీస్ లభిస్తుందనే ఉద్దేశంలో భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఎనిమిది మందితో కూడిన జట్టును ప్రకటించింది. జనవరి 12 నుంచి 17 వరకు యోనెక్స్ థాయ్లాండ్ ఓపెన్, 19 నుంచి 24 వరకు టయోటా థాయ్లాండ్ ఓపెన్, 27 నుంచి 31 వరకు బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్ జరుగనున్నాయి. వీటిల్లో భారత క్రీడాకారులు తలపడనున్నారు.
‘జనవరి మొదటి వారంలో నేను ప్రయాణం చేస్తాను. బ్రిటన్ నుంచి థాయ్లాండ్కు ప్రయాణ ఆంక్షలు లేవు. దోహా నుంచి నేను వెళ్లగలను. థాయ్ చేరుకొనేందుకు గల్ఫ్ దారిని ఎంచుకుంటాను. ప్రస్తుతం నా సాధన బాగా సాగుతోంది. ఇంగ్లాండ్లోని జాతీయ శిక్షణా కేంద్రం మూసివేయలేదు. బయోబబుల్ విధానంలో నడుస్తోంది. దాంతో థాయ్ ఓపెన్ ముందు సైతం సాధన చేసుకోగలను’ అని పీవీ సింధు తెలిపింది.
థాయ్ ఓపెన్తో బ్యాడ్మింటన్ మొదలవుతున్నప్పటికీ ప్రస్తుతం ఆ దేశంలో ప్రజాస్వామ్య ఉద్యమం జరుగుతోంది. కొవిడ్-19 కేసులూ పెరుగుతున్నాయి. గతవారం అక్కడ 548 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఇవీ చదవండి
2020.. కోహ్లీ ఏంటి?
క్రికెటర్ సురేశ్ రైనా అరెస్టు