
తాజా వార్తలు
‘జగన్ నిర్ణయాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించాలి’
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు
అమరావతి: ఆర్టీసీకి చెందిన 1300 ఎకరాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సిద్ధమయ్యారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం ఆర్టీసీ స్థలాలను 33ఏళ్లకు లీజుకివ్వటాన్ని తప్పుపట్టిన జగన్.. నేడు 50ఏళ్లపాటు లీజుకు ఇవ్వడానికి సిద్ధమయ్యారని మండిపడ్డారు. విశాఖపట్నం, కర్నూలు, కృష్ణా, తిరుపతి నగరాల్లోని రూ.1500కోట్లు విలువ చేసే ఆర్టీసీ స్థలాలను 50ఏళ్లపాటు ప్రైవేటు వ్యక్తుల స్వాధీనంలో ఉంటే.. అవి తిరిగి సంస్థ స్వాధీనం అవుతాయా? అని అయ్యన్న నిలదీశారు.
గడువు ముగియగానే అనుభవదారులు కోర్టుకు వెళ్లి తిరిగి లీజుహక్కులు పొందుతారని అయ్యన్నపాత్రుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను ఇప్పటికీ చూస్తున్నామన్నారు. ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు, అధికారులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించాలన్నారు. ఆర్టీసీ, ప్రభుత్వ భూములను ప్రైవేటు వారికి అప్పగించటం వల్ల తలెత్తే సమస్యలను సీఎంకు అర్థమయ్యేలా వివరించాలని అయ్యన్న సూచించారు.