
తాజా వార్తలు
గ్రేటర్లో ‘సర్జికల్’ హీట్
ఇంటర్నెట్ డెస్క్: గ్రేటర్ ఎన్నికల సమరం రసవత్తరంగా మారింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు వింటర్లో హీట్ పుట్టిస్తున్నాయి. అధికార తెరాస తరఫున ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నీతానై ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు. భాజపా తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, కాంగ్రెస్ తరఫున ప్రధానంగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తమ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా బండి సంజయ్ చేసిన ‘సర్జికల్ స్ట్రైక్స్’ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఓట్ల కోసం హైదరాబాదీలను బలి తీసుకుంటారా?: కేటీఆర్
తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ మంత్రి కేటీఆర్ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అదే సమయంలో కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ ఆరేళ్లలో హైదరాబాద్కు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలంటూ భాజపా నేతలను నిలదీస్తున్నారు. భాజపా తరఫున బండి సంజయ్ తదితరులు అధికార తెరాసపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో బండి సంజయ్ తాజాగా చేసిన ఆరోపణలు దుమారం రేపాయి. గ్రేటర్లో భాజపా గెలిస్తే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటూ ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. దీనిపై అటు తెరాసతో పాటు ఇటు ఎంఐఎం నేతలు మండిపడ్డారు. సంజయ్ వ్యాఖ్యలపై ముఖ్యంగా మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ను పాకిస్థాన్లోని ఉగ్రస్థావరాలతో పోలుస్తారా? హైదరాబాద్ ఏమైనా పాకిస్థాన్లో ఉందా? ఎందుకు సర్జికల్ స్ట్రైక్ చేస్తారని దుయ్యబట్టారు. పేదరికం, నిరుద్యోగంపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని హితవు పలికారు. నాలుగు ఓట్ల కోసం ఇంత చిల్లర రాజకీయమా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం కోటిమంది హైదరాబాదీలను బలి తీసుకుంటారా? అని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంతా ఆలోచించాలని.. ఆగమాగం కావొద్దని కేటీఆర్ హితవు పలికారు.
భారతీయులపై సర్జికల్ స్ట్రైక్ చేస్తారా?: అసదుద్దీన్
మరోవైపు సంజయ్ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. పాతబస్తీలో ఉన్న ముస్లింలంతా ఈ దేశ పౌరులేనని.. భారతీయులపై సర్జికల్ స్ట్రైక్ చేస్తారా? అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా భోలక్పూర్లో నిర్వహించిన ప్రచారంలో అసదుద్దీన్ మాట్లాడారు. సర్జికల్ స్ట్రైక్ చేయాలంటే లద్దాఖ్ సరిహద్దులో చైనాపై మెరుపుదాడి చేయాలని సవాల్ విసిరారు. ‘సర్జికల్ స్ట్రైక్’ వ్యాఖ్యలపై దుమారం గ్రేటర్ ఎన్నికలు ముగిసేవరకూ కొనసాగే అవకాశముంది.
ఇవీ చదవండి..
తెరాస మాటలు పచ్చి అబద్ధం: రేవంత్రెడ్డి
భాజపాకు విషం తప్ప విషయం లేదు:కేటీఆర్
ఐదేళ్లలో ఎప్పుడూ లేనిది ఇప్పుడేంటి?:అర్వింద్