
తాజా వార్తలు
కొత్త ఆలయం, మసీదు నిర్మిస్తాం: కేసీఆర్
హైదరాబాద్: సచివాలయ భవనాల కూల్చివేతతో ఆలయం, మసీదుకు ఇబ్బంది కలగడంపై సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. సచివాలయ స్థలంలో ప్రభుత్వ ఖర్చుతో ఎక్కువ విస్తీర్ణంలో ఆలయం, మసీదు నిర్మిస్తామన్నారు. భవనాలు కూల్చే క్రమంలో ప్రార్థనామందిరాలపై శిథిలాలు పడి కొంతనష్టం జరిగిందని తెలిపారు. ఇలా జరగడంపట్ల ఎంతో చింతిస్తున్నానని, ఇది కాకతాళీయంగా జరిగిందని, అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరారు. ‘‘ప్రార్థనామందిరాలకు ఇబ్బంది కలిగించడం ప్రభుత్వ ఉద్దేశం కాదు.ఎన్నికోట్లయినా వెనుకాడకుండా ఆలయం, మసీదు నిర్మిస్తాం. పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మించి వాటిని సంబంధిత వ్యక్తులకు అప్పగిస్తాం.దేవాలయం, మసీదు నిర్వాహకులతో నేనే త్వరలోనే సమావేశమవుతాను. వారి అభిప్రాయాలు తీసుకుని, కొత్త సెక్రటేరియట్ భవన సముదాయంతో పాటుగా ప్రార్థనా మందిరాలను నిర్మించి ఇస్తామని హామీ ఇస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ‘తెలంగాణ సెక్యులర్ రాష్ట్రమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లౌకిక స్పూర్తిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.