
తాజా వార్తలు
అది నా బాధ్యతగా భావించట్లేదు: విద్యాబాలన్
హైదరాబాద్: బాలీవుడ్లో మహిళల ప్రాముఖ్యతను పెంచిన నటీమణుల్లో విద్యాబాలన్ ఒకరు. మహిళా ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకొంటూ.. అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఎన్నో పురస్కారాలు కూడా ఆమెను వరించాయి. తనపై ప్రజలు చూపించే ప్రేమ అన్నింటికీ కంటే ఎంతో విలువైందని చెబుతున్న ఆమె.. గొప్ప మహిళా కథలు తనకెంతో ప్రేరణ కలిగిస్తాయని అంటున్నారు. అయితే.. మహిళా ప్రాధాన్యమున్న సినిమాల్లో చేయడం తన బాధ్యతగా భావించడం లేదని స్పష్టం చేశారు.
‘మహిళా కథలను చూపించడం నా బాధ్యతగా భావించడం లేదు. కాకపోతే.. గొప్ప మహిళల జీవితాల నుంచి నేను ఎంతో ప్రేరణ పొందుతాను. నా జీవితంపైనా అవి ఎంతో ప్రభావితం చూపించాయి. అందుకే నేను అలాంటి కథలు ఎక్కువగా ఎంచుకుంటాను. అయితే.. సహజసిద్ధంగా ఉంటే ఏ కథనైనా చేయడానికి నేను సిద్ధం’ అని ఆమె చెప్పుకొచ్చారీ ‘ది దర్టీ పిక్చర్’ హీరోయిన్.
ముంబయికి చెందిన విద్యాబాలన్ 2003లో ఓ బెంగాలీ సినిమాతో సినిమా పరిశ్రమకు పరిచయ్యారు. 2005లో ‘పరిణిత’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టారు. సిల్క్స్మిత జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ది డర్టీ పిక్చర్’తో విద్యాబాలన్కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆమె చాలా చిత్రాల్లో నటించారు. ఇటీవల ఆమె ప్రధానపాత్రలో నటించిన ‘నట్ఖట్’ ఉత్తమ జాతీయ లఘుచిత్రంగా ఎంపికైంది. దీంతో నేరుగా ఆస్కార్కు కూడా అర్హత సాధించింది. ఆ సినిమా కూడా మహిళా ప్రాధాన్యమైనదే కావడం విశేషం. విద్యాబాలన్.. జాతీయ చలనచిత్ర పురస్కారంతో పాటు ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డులు సహా పలు అవార్డులు అందుకుంది. ఆమెను 2014లో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ ఇచ్చి గౌరవించింది.
ఇవీ చదవండి..
నేను విద్యా బాలన్ను డిన్నర్కు పిలవలేదు...!
‘‘అనుకరించొద్దు... జీవిత సారాంశం గ్రహించాలి’’