
తాజా వార్తలు
గోడు మిగిల్చిన గూడు
గోడ కూలి దంపతులు, చిన్నారి మృతి
వర్ని, బోధన్ పట్టణం, న్యూస్టుడే: తమకంటూ ఒక ఇల్లు ఉండాలని కలగన్నది ఆ కుటుంబం... పంచాయతీ పరిధిలోనే గ్రామ పెద్దలు వారికి స్థలం చూపించగా తాత్కాలిక రేకుల షెడ్డు నిర్మించుకుంటున్నారు... అమావాస్య వెళ్లిపోగానే సొంత షెడ్డులోకి వెళదామనుకున్న వారిని అమావాస్య చీకట్లు కమ్మేశాయి. గురువారం సాయంత్రం కూడా భార్యా, భర్తలిద్దరూ వెళ్లి కొత్త ఇంటి పనులు చేసుకుని వచ్చి నిద్రకు ఉపక్రమించినట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మూడేళ్లుగా తలదాచుకునేందుకు ఉపయోగపడిన అద్దె గది తాత్కాలిక గోడలే వారి కలలను శాశ్వత సమాధి చేశాయి. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తగిలేపల్లిలో గోడ కూలిన ఘటనలో భార్య, భర్త వారి చిన్నారి దుర్మరణం చెందారు. ఈ ఘటనతో వారి ముగ్గురి ఆడపిల్లలు అనాథలయ్యారు. తగిలేపల్లిలో శ్రీనివాస్(35), లక్ష్మి(30) దంపతులు కూలి పనులు చేసుకుని జీవిస్తున్నారు. వీరి పిల్లలు సంజన(8), అశ్విని(5), వైష్ణవి(3), సాయికుమార్(1) కాగా లక్ష్మి తల్లి గంగామణి కూడా వీరితోనే ఉంటోంది. తెలిసిన వ్యక్తి ఇంటి వసారా కోసం నిర్మించిన గదిలో అద్దెకు ఉంటున్నారు. పై కప్పు లేక పరదాలు కట్టుకుని ఉండేవారు. శుక్రవారం తెల్లవారుజామున వీరు నిద్రలో ఉండగా ఒక్కసారిగా గది గోడలు కూలాయి. లక్ష్మి, ఏడాది బాబు అక్కడికక్కడే మృతి చెందారు. ఆసుపత్రికి తరలించేలోపే శ్రీనివాస్ మరణించారు.
అమ్మ కోసం బిడ్డల ఆరాటం: చిన్న కుమార్తె వైష్ణవికి తీవ్ర గాయాలవగా హైదరాబాద్ తరలించారు. మిగిలిన ఇద్దరు కుమార్తెలకు బోధన్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ‘అమ్మ దగ్గరికి పోతాం’ అంటూ ఆ చిన్నారులు రోదించడం అందరినీ కలచివేసింది. కళ్లెదుటే కూతురు విగతజీవిగా మారడం వృద్ధురాలైన గంగామణికి తీరని వేదన మిగిల్చింది.