
తాజా వార్తలు
భారత్లో 24 గంటల్లో 6,654 కేసులు
ఒక్కరోజులో ఇదే అత్యధికం
దిల్లీ: భారత్లో కరోనా మహమ్మారి రోజురోజుకీ తన ప్రతాపాన్ని విస్తృతం చేస్తోంది. గడచిన 24 గంటల్లో 6,654 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక్కరోజు వ్యవధిలో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,25,101కి చేరింది. వీరిలో 51,783 మంది కోలుకోగా.. 69,597 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక కొత్తగా మరో 137 మంది మరణించడంతో మృతుల సంఖ్య 3,720కి పెరిగింది. గత నాలుగు రోజుల్లో దాదాపు 25 వేల కేసులు నమోదుకావడం గమనార్హం.
వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో బాధితుల సంఖ్య 44582కు పెరిగింది. వీరిలో 12,583 మంది కోలుకోగా.. 1517 మంది మృత్యువాతపడ్డారు. ఇక 14,753కేసులతో గుజరాత్ తర్వాతి స్థానంలో ఉంది. వీరిలో 98 మంది మృత్యువాతపడగా.. 7128 మంది కోలుకొని ఇళ్లకు చేరారు. ఓవైపు ప్రముఖ మెడికల్ జర్నల్ ‘ది ల్యాన్సెట్’ హైడ్రాక్సీక్లోరోక్విన్ వల్ల పెద్దగా ప్రయోజనాలు ఉన్నట్లు నిర్ధారణ కాలేదని పేర్కొన్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం దీని వాడకాన్ని విస్తృత పరుస్తూ కొత్త మార్గదర్శకాల్ని జారీ చేసింది. ముందుజాగ్రత్తగా కంటెయిన్మెంట్ జోన్లలో పనిచేసే పోలీసులు, పారామిలటరీ సిబ్బందికి కూడా హెచ్సీక్యూ ఇవ్వాలని ఐసీఎంఆర్ సిఫార్సు చేసింది. ఈ మాత్రలు తీసుకుంటున్న వైద్యసిబ్బందిలో దుష్పరిణామాలు కనిపిస్తున్నప్పటికీ వైరస్ సంక్రమణ విషయంలో అది చెప్పుకోదగ్గ స్థాయిలోనే పనిచేస్తున్నట్లు పేర్కొంది.
ఇవీ చదవండి..