
తాజా వార్తలు
పార్టీకి పిలిచి సామూహిక అత్యాచారం
ముంబయి : నిశ్చితార్థం పార్టీకి అని పిలిచి ఓ యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ముంబయిలో చోటు చేసుకుంది. స్థానిక ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపిన వివరాల మేరకు.. అవినాశ్ పంగీకర్, శిశిర్, తేజస్ అనే ముగ్గురు వ్యక్తులు బాధితురాలితో పాటు మరో ఇద్దరు యువతులను నవంబరు 8న ముంబయిలోని అంథేరీ- కుర్లా రోడ్డులో ఉన్న ఓ హోటల్కు పిలిపించుకున్నారు. పంగీకర్కు నిశ్చితార్థం జరగడంతో దానికి సంబంధించి పార్టీ ఇస్తామని ఈ ముగ్గురు వ్యక్తులు స్నేహితురాళ్లు అయిన యువతులను ఆహ్వానించారు. చీకటి పడుతున్న సమయంలో ఆ ముగ్గురిలో ఇద్దరు యువతులు ఇళ్లకు వెళ్లారు. మూడో యువతి కూడా వెళ్లబోతున్న సమయంలో పంగీకర్ ఆమెతో బలవంతంగా మద్యం తాగించాడు. అనంతరం మద్యం మత్తులో ఉన్న యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
వారం రోజులుగా ఈ దుశ్చర్యను ఎవరికీ చెప్పుకోని బాధితురాలు శనివారం తన కుటుంబ సభ్యులకు తనపై అత్యాచారం జరిగినట్లు వెల్లడించింది. వాళ్ల సాయంతో పోలీస్స్టేషన్కు వెళ్లి ఘటనపై ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని స్థానిక ఆసుపత్రికి పంపించారు. నిందితులుగా అనుమానిస్తున్న ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు వాళ్లు గుర్తించారు. నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.