
తాజా వార్తలు
పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై ఎస్ఈసీ దృష్టి
జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన నిమ్మగడ్డ
అమరావతి: ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ మేరకు చిత్తూరు, గుంటూరు జిల్లాలు మినహా 11 జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు. హైకోర్టు ఆదేశాల అనంతరం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని.. ప్రజలను ప్రలోభపెట్టే విధంగా ఉండే సంక్షేమ పథకాలు, ఇతరత్రా అంశాలపై దృష్టి సారించాలని సూచించారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని.. వీటిపై పూర్తిస్థాయిలో నిఘా ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఎస్ఈసీ ఆదేశించారు. సజావుగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని.. ఎలాంటి విమర్శలు రాకుండా నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టాలన్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. భద్రతా పరంగానే కాకుండా ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
మరోవైపు రేపు ఉదయం 11 గంటలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలవనున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఆయన చర్చించే అవకాశముంది.
సుప్రీంలో కేవియట్ దాఖలు చేసిన ఎస్ఈసీ
సుప్రీంకోర్టులో రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం కేవియట్ దాఖలు చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీపై ఈ పిటిషన్ వేసింది. ఎస్ఎల్పీ విచారణ సమయంలో తమ వాదనలు వినాలని సుప్రీంకోర్టును రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. తమ వాదనలు విన్నాకే ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో ఎస్ఈసీ కోరింది.