
తాజా వార్తలు
ఏపీకి రావాల్సిన నిధులు ఇవ్వండి: బుగ్గన
దిల్లీ: హైకోర్టు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను రద్దు చేయడం ప్రజలు, ఫ్రంట్లైన్ వారియర్ల విజయమని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వ్యాఖ్యానించారు. ధర్మాసనం తీర్పుతో రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. దిల్లీ పర్యటనలో ఉన్న బుగ్గన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రానికి ఇచ్చే నిధులను త్వరగా ఇవ్వాలని కోరారు. ఆయన వెంట ప్రభుత్వప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ఉన్నారు.
పోలవరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లను సరిచేస్తున్నామని బుగ్గన అన్నారు. గత ప్రభుత్వంలో తప్పుడు ఒప్పందాలు జరిగినట్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇళ్లులేని పేదలకు 31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చామని, వారికి పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. అనంతరం కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీతో బుగ్గన భేటీ అయ్యారు. ఓర్వకల్లు ఎయిర్పోర్టు నుంచి ఇండియో కమర్షియల్ ఆపరేషన్లపై చర్చించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు బుగ్గన వివరించారు.
ఇదీ చదవండి
ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ నిలివేత