
తాజా వార్తలు
అభిషేక్ బెనర్జీ భార్యను ప్రశ్నిస్తోన్న సీబీఐ!
కోల్కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ నివాసానికి మంగళవారం సీబీఐ అధికారులు చేరుకున్నారు. బొగ్గు కుంభకోణం కేసులో భాగంగా అభిషేక్ భార్య రుజిరా బెనర్జీని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆమె లావాదేవీలపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. కాగా ఈ రోజు సీబీఐ అధికారులు అభిషేక్ ఇంటికి రానున్న క్రమంలో కొద్దిసేపటి ముందే సీఎం మమతా బెనర్జీ వారి ఇంటిని సందర్శించడం గమనార్హం.
బొగ్గు చౌర్యం కేసులో అభిషేక్ బెనర్జీ మరదలు మేనకా గంభీర్ను సీబీఐ అధికారులు సోమవారం ప్రశ్నించిన విషయం తెలిసిందే. అనంతరం అభిషేక్ బెనర్జీ భార్యకు సమన్లు అందజేశారు. దీనిపై సోమవారం రుజిరా బెనర్జీ స్పందిస్తూ.. తనను ప్రశ్నించేందుకు నివాసానికి రావాలని అధికారులకు లేఖ రాశారు. తనను అధికారులు ఎందుకు ప్రశ్నించాలనుకుంటున్నారో తెలియదని అందులో వెల్లడించారు.
పశ్చిమబెంగాల్లోని కునుస్తోరియా, ఖజోరియాల్లో అక్రమ మైనింగ్ జరిగినట్లు అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఈ వ్యవహారంలో టీఎంసీ నేతలకు మాఫియా నుంచి డబ్బులు అందాయన్న ఆరోపణలపై సీబీఐ గతేడాది నవంబర్లోనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.