
తాజా వార్తలు
ఇది వింతలకే వింత.. :చిదంబరం
దిల్లీ: వ్యవసాయ చట్టాల పట్ల కేంద్రం అవలంబిస్తున్న వైఖరిని వింతల్లో కెల్లా వింతగా కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అభివర్ణించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో చేసిన ప్రకటనలో.. ‘‘వ్యవసాయ విధానాలపై చర్చానంతరం.. నీతి ఆయోగ్ కమిటీ సంబంధిత నివేదికను సెప్టెంబర్ 2019లోనే సమర్పించింది. ఐతే 16 నెలలు గడిచినా ఇప్పటికీ దానిని నీతి ఆయోగ్ పాలక మండలికి సమర్పించనే లేదు. ఇలా ఎందుకు జరిగింది అనేది ఎవరికీ తెలీదు.. ఎవరూ సమాధానం చెప్పరు’’ అని ఆయన విమర్శించారు.
‘‘అంజలీ భరద్వాజ్ అనే సామాజిక కార్యకర్త వ్యవసాయ చట్టాలకు సంబంధించిన సమాచారాన్ని కోరుతూ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా దరఖాస్తు చేశారు. కాగా, నివేదికను ఇంకా సమర్పించలేదనే సాకుతో ఆమె ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు అధికారులు నిరాకరించారు. నాడు అలీస్ (ప్రముఖ ఆంగ్ల నవల ‘అలీస్ ఇన్ వండర్లాండ్’లో ముఖ్య పాత్ర) చెప్పినట్టు ఇది వింతలకే వింతలాగా ఉంది. ఏదేమైనా సరైన సమాచారాన్ని రాబట్టాలనే అంజలి దీక్ష, పట్టుదలకు నా వందనాలు’’ అని మరో ట్వీట్లో ఆయన వెల్లడించారు.
నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ..వేలాది రైతులు దిల్లీ సరిహద్దులో మకాం వేసి నిరసనలు తెలియచేస్తున్న సంగతి తెలిసిందే. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని చిదంబరం పలుమార్లు విమర్శించారు. ఇక ఈ అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవటం పట్ల కాంగ్రెస్ నేత హర్షం వ్యక్తం చేశారు. కాగా.. కేంద్రం, రైతు ప్రతినిధుల మధ్య తదుపరి దఫా చర్చలు జనవరి 19న జరుగనున్నాయి.
ఇదీ చదవండి..