
తాజా వార్తలు
విశాఖ ఉక్కుపై ప్రధానికి వీహెచ్ లేఖ
హైదరాబాద్: విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేసే ప్రక్రియను నిలిపేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఇవాళ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఉక్కు తయారీకి అవసరమైన ఇనుప ఖనిజం అందుబాటులో ఉందని.. పరిశ్రమను ప్రైవేటుపరం చెయ్యాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. యూనివర్సిటీలను, ప్రభుత్వ సహకారంతో నడిచే పరిశ్రమలను ప్రైవేటుకు అప్పగిస్తే రిజర్వేషన్లు పొందే వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తానని చెప్పిన మోదీ ప్రభుత్వం.. ఉన్న ఉద్యోగాలను తొలగిస్తోందని వీహెచ్ విమర్శించారు. దేశంలోని అన్ని పార్టీలు ఏకమై ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్పరం చేయడానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సి ఉందని పిలుపునిచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకూ విశాఖ ఉక్కు.. మా హక్కు అని పోరాటం చేస్తామని ఆయన ప్రధానికి రాసిన లేఖలో స్పష్టం చేశారు.