
తాజా వార్తలు
ఏపీలో ఒక్క రోజే 43 కరోనా కేసులు
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఒక్క రోజే 43 కొవిడ్ కేసులు నమోదు కావడం గమనార్హం. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో 87కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9 గంటల మధ్య 43 కొత్త కేసులు నమోదైనట్లు తాజా బులిటెన్లో తెలిపింది. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగైనట్లు పేర్కొంది. దిల్లీలో మతపరమైన ప్రార్థనలకు హాజరై తిరిగివచ్చిన వారి ఆరోగ్య పరిస్థితిని తనిఖీ చేయడంతో పెద్ద ఎత్తున కేసులు వెలుగులోకి వచ్చాయి. గత 12 గంటల వ్యవధిలో 373 మంది నమూనాలను పరీక్షించగా.. అందులో 330 నెగిటివ్గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఒక్క రోజే తొలిసారిగా కడప జిల్లాలో 15, పశ్చిమగోదావరి జిల్లాలో 13 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. చిత్తూరు జిల్లాలో 5, ప్రకాశం జిల్లాలో 4, తూర్పుగోదావరి జిల్లాలో 2, నెల్లూరు జిల్లాలో 2, కృష్ణ 1, విశాఖ జిల్లాలో 1 కొత్త కేసు నమోదయ్యాయి. నిజాముద్దీన్ ఘటన నేపథ్యంలో ఆయా జిల్లాలు పూర్తిగా అప్రమత్తమయ్యాయి.
11 జిల్లాలకు విస్తరించిన కరోనా..
రాష్ట్రంలో కరోనా వైరస్ 11 జిల్లాలకు విస్తరించింది. ఈ రోజు కొత్తగా పలు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటి వరకూ ఎలాంటి కేసులు నమోదు కాలేదు.
సీఏం ఉన్నతస్థాయి సమీక్ష..
కరోనా వైరస్ కేసులు భారీగా పెరగడంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ, మోపిదేవీ, ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.
ఇప్పటి వరకూ జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు..