
తాజా వార్తలు
గొల్లపూడిలో దేవినేని ఉమా దీక్ష
విజయవాడ: కృష్ణా జిల్లా గొల్లపూడిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. అమరావతి ఉద్యమం 400వ రోజుకు చేరిన సందర్భంగా గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిరసన దీక్షకు సిద్ధమయ్యారు. దీక్షకు మద్దతు తెలిపేందుకు తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఉమా నివాసానికి చేరుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహం వద్దకు బయల్దేరిన దేవినేని ఉమా, ధూళిపాళ్ల నరేంద్రలను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో నేతలు వాగ్వాదానికి దిగారు. అధికార పార్టీ నేతలకు అనుమతులిచ్చి తమను ఎలా అడ్డుకుంటారని నిలదీశారు. ఎందుకు అడ్డుకుంటున్నారో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు అనుమతి నిరాకరించడంతో దేవినేని ఉమా ఇంటి ఆవరణలోనే దీక్షకు కూర్చున్నారు. మరో వైపు గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ.. సీఎం జగన్ పోలీసులను అడ్డు పెట్టుకుని పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ‘‘రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు కావడంలేదు. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు. నిజాయితీగల పోలీసు అధికారులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. పోలీసులు వైకాపా కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. పోలీసు వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు. భారతి సిమెంట్ గురించి మాట్లాడిన తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిని అరెస్టు చేయాలని ఆదేశాలు రావడం సిగ్గుచేటు. సీఎం దిల్లీ ఎందుకు వెళ్లారో చెప్పాలి. ఈడీ కేసుపైనే అమిత్ షాను కలిసింది వాస్తవం కాదా? దిల్లీలో అమిత్ షా కాళ్లు పట్టుకున్నారు. ప్రశాంతమైన గొల్లపూడిలో వందలమంది పోలీసులను ఎందుకు మోహరించారు’’ అని దేవినేని ఉమా ప్రశ్నించారు. ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ.. ఇన్సైడర్ ట్రేడింగ్ ప్రచారం నిజం చేయాలని కష్టపడ్డారు కానీ, నిన్న హైకోర్టు తీర్పుతో అంతా తేటతెల్లమైందన్నారు. రాజధాని ప్రాంతంలో భూములు కొన్నవారిని వైకాపా నేతలు అనేక ఇబ్బందులు పెట్టారని గుర్తు చేశారు.
ఇవీ చదవండి...