
తాజా వార్తలు
ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే.. దేశద్రోహం అనలేం
పిటిషనర్కు రూ.50వేల జరిమానా
దిల్లీ: ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం, ప్రభుత్వ అభిప్రాయాలకు భిన్నమైన భావాలను వ్యక్తపర్చడాన్ని దేశద్రోహంగా పేర్కొనలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ ఫరూఖ్ అబ్దుల్లాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది.
జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేస్తూ 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీన్ని వ్యతిరేకించిన ఫరూఖ్ అబ్దుల్లా.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీంతో కొందరు ఆయనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించేందుకు అబ్దుల్లా.. చైనా, పాకిస్థాన్ సాయం తీసుకుంటూ దేశద్రోహానికి పాల్పడుతున్నారని పిటిషనర్ ఆరోపించారు.
ఈ పిటిషన్పై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రభుత్వ అభిప్రాయాలను వ్యతిరేకించినంతమాత్రాన దేశ ద్రోహంగా పేర్కొనలేమని తెలిపింది. అబ్దుల్లాపై చేసిన ఆరోపణలను రుజువు చేయడంలో ఫిర్యాదు చేసిన వ్యక్తి విఫలమైనందున ఈ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా పిటిషనర్కు రూ.50వేల జరిమానా విధించింది.