
తాజా వార్తలు
ఖమ్మం కలికితు‘రాయి’!
కొన్ని శిలలు కొండలుగా మిగిలిపోతాయి. మరికొన్ని మహా సౌధాలవుతాయి. ఇంకొన్ని గుళ్లో దేవతామూర్తులవుతాయి.
కానీ ఈ శిల మాత్రం భారతదేశ ఉద్వేగమైంది. త్యాగానికి నిలువెత్తు నిదర్శనమైంది. ఖమ్మం జిల్లా నుంచి సేకరించి తరలించిన బ్లాక్ గ్రానైట్ ఏకశిల దేశ రాజధాని దిల్లీలో పోలీసు అమర వీరుల స్మారక స్తూపంగా రూపుదిద్దుకుంది. ప్రధానమంత్రితో సహా, మహామహులందరి ముందు అమరవీరుల త్యాగాలకు చిహ్నంగా మారి నివాళులందుకుంటోంది. 2018లో జాతీయ పోలీసు అమర వీరుల స్తూపం నిర్మించాలని నిర్ణయించినప్పుడు అందుకు అనువైన శిల కోసం దేశవ్యాప్తంగా వెదకడం మొదలుపెట్టారు. చివరకు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి మండలం చెర్వుమాదారం గ్రామంలోని బ్లాక్ గ్రానైట్ క్వారీలో నాణ్యమైన రాయి వారి దృష్టిని ఆకర్షించింది. భూమి ఉపరితలానికి 150 అడుగుల లోతులో నుంచి ఈ ఏకశిలను తీసి బ్లాక్ గ్రానైట్ రాయిని గుర్తించి దాన్ని దిల్లీకి తరలించారు. నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్స్ డైరెక్టర్ జనరల్ ఘడ నాయక్ పర్యవేక్షణలో దిల్లీ చేరుకున్న బ్లాక్ గ్రానైట్ ఏకశిల రాయిని శిల్పులతో సుందరంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. స్మారక స్తూపంగా ప్రతిష్ఠించారు.