
తాజా వార్తలు
మాట మీద నిలబడి.. టాస్క్ పూర్తి చేసిన జక్కన్న
చెర్రీ, తారక్కు రాజమౌళి ఛాలెంజ్
హైదరాబాద్: టాలీవుడ్ హీరోలు రామ్చరణ్, ఎన్టీఆర్కు దర్శకధీరుడు రాజమౌళి ఛాలెంజ్ విసిరారు. లాక్డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో సెలబ్రిటీలందరూ ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ‘అర్జున్రెడ్డి’ చిత్ర దర్శకుడు సందీప్రెడ్డి వంగా తన సతీమణికి ఇంటి పనుల్లో సాయం చేస్తున్న ఓ వీడియోను చిత్రీకరించి ట్విటర్ వేదికగా పోస్ట్ చేస్తూ.. రాజమౌళికి ఛాలెంజ్ విసిరారు. సందీప్ విసిరిన ఛాలెంజ్ను స్వీకరించిన రాజమౌళి సైతం సోమవారం వీడియోను అప్లోడ్ చేస్తానని చెప్పారు.
దీంతో తాజాగా జక్కన్న చెప్పినట్లుగానే తన సతీమణి రమా రాజమౌళికి ఇంటి పనుల్లో సాయం చేస్తున్న ఓ వీడియోను నేడు ట్విటర్ వేదికగా షేర్ చేశారు. ఇంట్లోని గదులను శుభ్రం చేయడంతోపాటు తలుపులు, కిటికీలను పరిశుభ్రం చేశారు. ‘సందీప్రెడ్డి వంగా నువ్వు ఇచ్చిన టాస్క్ పూర్తి చేశాను. తారక్, రామ్చరణ్తోపాటు శోభూ యార్లగడ్డ, సుకుమార్, కీరవాణికి ఈ ఛాలెంజ్ విసురుతున్నాను. #BetheREALMAN’ అని జక్కన్న పేర్కొన్నారు.
రామ్చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్చరణ్, కొమరం భీమ్గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. రామ్చరణ్ సరసన బాలీవుడ్ నటి ఆలియాభట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలివియా మోరీస్ సందడి చేయనున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు.