
తాజా వార్తలు
లైసెన్స్ లేని యువతికి వాహనం ఇచ్చినందుకు జైలు
అజయ్ సింగ్
కేపీహెచ్బీకాలనీ, న్యూస్టుడే: లైసెన్స్ లేని యువతికి వాహనం ఇచ్చిన వ్యక్తి జైలుపాలయ్యాడు. కేపీహెచ్బీ ఠాణా పరిధిలో ఈనెల 20న రాత్రి హైదర్నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బీడీఎస్ విద్యార్థిని ఆది రేష్మ(20) మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆమెకు వాహనం ఇచ్చిన అజయ్సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. సీఐ లక్ష్మీనారాయణ కథనం ప్రకారం.. ఈనెల 20న రేష్మ స్నేహితులతో కలిసి మియాపూర్లో సినిమా చూశారు. తిరిగొచ్చే క్రమంలో స్నేహితుల్లో ఒకరైన అజయ్సింగ్ నడుపుతున్న స్కూటీపై ఆమె వెనక కూర్చొంది. రాత్రి 11.40 గంటల సమయంలో మార్గమధ్యలో జలమండలి కార్యాలయం వరకు రాగానే తాను బండి నడుపుతానని వాహనం తీసుకుంది. కొంతదూరం నడిపిన అనంతరం వాహనం అదుపు తప్పి ఇసుక లారీ చక్రాల కింద పడిపోవడంతో చనిపోయింది. రేష్మకు బండి నడపడం రాదు. లైసెన్స్ కూడా లేదు. ఈ విషయం తెలిసీ, వాహనం ఇచ్చిన అజయ్సింగ్పై పోలీసులు కేసు నమోదు చేసి సోమవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. లారీ డ్రైవర్ కృష్ణ పరారీలో ఉన్నాడు.