
తాజా వార్తలు
రైతు పొలంలో బంగారం బిందె
జనగామ రూరల్: జనగామ జిల్లా పెంబర్తి గ్రామంలో గురువారం బంగారం బిందె లభ్యమైంది. రెవెన్యూ, పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన నర్సింహ పెంబర్తి గ్రామ పరిధిలో వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారికి సమీపంలో 11 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఆ భూమిలో వెంచర్ ఏర్పాటు కోసం జేసీబీతో భూమిని చదును చేస్తుండగా లంకె బిందె కనిపించింది.
వెంటనే భూ యజమాని నర్సింహ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి బిందెను తెరిచి చూడగా అందులో 17తులాల బంగారం, 10కిలోల వెండి లభ్యమైంది. ఈ విషయంపై భూ యజమాని నర్సింహ మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా తనకు కలలో అమ్మవారు కనిపిస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తన భూమిలో అమ్మవారి గుడి కట్టించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, తహసీల్దారు రవీందర్, గ్రామ సర్పంచి ఆంజనేయులు, పోలీసులు ఘటనాస్థలాన్ని సందర్శించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పురావస్తు శాఖ అధికారులు స్పందించి మరింత తవ్వకాలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.