
తాజా వార్తలు
పనిమీద వచ్చి... మంటల్లో చిక్కి...
పరిశ్రమలో పేలుడు... రసాయన శాస్త్రవేత్త దుర్మరణం
ఐడీఏ బొల్లారం (జిన్నారం): పరిశ్రమకు తాత్కాలిక పనిమీద వచ్చిన రసాయన శాస్త్రవేత్త, అక్కడ జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడిన ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారంలో జరిగింది. సీఐ జి.ప్రశాంత్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా హుజూర్నగర్కు చెందిన రసాయన శాస్త్రవేత్త అబ్దుల్ సత్తార్(38)... సంగారెడ్డి మండలం కంది సమీపంలో ఆస్గ్రో లేబొరేటరీ నిర్వహిస్తున్నారు. వ్యాపారం నిమిత్తం ఆయన గురువారం సాయంత్రం ఐడీఏ బొల్లారంలోని పీఎన్ఎం లైఫ్సైన్స్ పరిశ్రమకు వచ్చారు. అదే సమయంలో పరిశ్రమలో రసాయన చర్యల వల్ల ఒక్కసారిగా పేలుడు సంభవించి పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులకు గాయాలు కాగా, వారిని హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాక పరిశీలించగా, సత్తార్ మృతదేహం కాలిపోయిన స్థితిలో కనిపించింది. పేలుడు సంభవించగానే తప్పించుకోబోతుండగా, గోడ కూలి సత్తార్పై పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు సీఐ వివరించారు.