
తాజా వార్తలు
చివరి ఓటేసి.. అందరినీ వదిలేసి..
కేపీహెచ్బీలో వివాహిత బలవన్మరణం
భర్త, అత్తమామల వేధింపులే కారణం
శ్రావణి
కేపీహెచ్బీకాలనీ, న్యూస్టుడే: భర్త, అత్తమామల వేధింపులను భరించలేని ఓ వివాహిత తనువు చాలించింది. మంగళవారం బల్దియా ఎన్నికల్లో బాధ్యతగా ఓటు వేసి ఆత్మహత్య చేసుకోవడం కలచివేసింది. కేపీహెచ్బీ సీఐ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన భీంశెట్టి సత్యనారాయణ ఈసీఐఎల్ విశ్రాంత ఉద్యోగి. కేపీహెచ్బీలో ఉంటున్నారు. ఆయనకు భార్య, కుమార్తె శ్రావణి(25), కుమారుడు కల్యాణ్ ఉన్నారు. పిల్లలిద్దరూ బీటెక్ చదివారు. శ్రావణి ఈసీఐఎల్లో కొంతకాలం ఉద్యోగం చేసింది. మిర్యాలగూడకు చెందిన వీరబొమ్ము శ్రీనివాస్ రెండో కుమారుడు, సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన ప్రదీప్తో ఆమెకు 2019 నవంబరు 10న వివాహమైంది. కొంత కాలానికే భర్తతోపాటు అత్తమామలు శ్రీనివాస్, హైమావతి వేధించం మొదలుపెట్టారు. ‘నీ నడక కుంటిగా ఉంటుంది, నీ మనసులో ఎవరో ఉన్నారంటూ’ హింసించేవారు. ఫిబ్రవరి 10న ప్రదీప్ అమెరికా వెళ్లాడు. వీడియో కాల్ చేసి వేధించేవాడు. లాక్డౌన్ సందర్భంగా శ్రావణి జులైలో పుట్టింటికి వచ్చింది. హైమావతి నవంబరులో అమెరికాలోని కుమారుల వద్దకు వెళ్లింది. మంగళవారం పోలింగ్ సందర్భంగా శ్రావణి ఉదయమే ఓటేసి ఇంటికొచ్చి పడక గదిలోకి వెళ్లింది. నిద్రిస్తుందేమోనని భావించారు. టిఫిన్ కోసం తల్లి తలుపు కొట్టగా స్పందన లేదు. ఇరుగుపొరుగుతో తలుపులు పగులగొట్టి చూడగా ఉరేసుకొని కనిపించింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మామ శ్రీనివాస్ను అరెస్టు చేశారు.