
తాజా వార్తలు
దిల్లీలో టెన్షన్.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత!
దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన గణతంత్ర పరేడ్ తీవ్ర ఉద్రిక్తతలకు వేదికగా మారింది. పోలీసులు అనుమతించిన రూట్ మ్యాప్ను పక్కనపెట్టి రైతులు ఎర్రకోట వైపు దూసుకెళ్లడం కలకలం రేపింది. ఎర్రకోట బురుజులపైకి ఎక్కిన రైతులు అక్కడే జెండాలతో నినాదాలు చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దిల్లీలోని పలు ప్రాంతాల్లో కేంద్రం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. రాత్రి 12గంటల వరకు టెలికాం, ఇంటర్నెట్ సేవలు నిలుపుదల చేస్తున్న్టట్టు వెల్లడించింది. శాంతిభద్రతల దృష్ట్యా సింఘు, టిక్రీ, ఘాజీపూర్, ముఖుర్దాచౌక్, నగ్లోయ్ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్టు కేంద్రం తెలిపింది.
మెట్రో స్టేషన్ల గేట్లు మూసివేత
మరోవైపు, గణతంత్ర పరేడ్తో మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. దేశ రాజధాని నగరంలో ఉద్రిక్తతల నేపథ్యంలో దిల్లీ మెట్రో అధికారులు అప్రమత్తమయ్యారు. తొలుత ఐటీవో మెట్రో స్టేషన్ ప్రవేశ, నిష్క్రమణ గేట్లు మాత్రమే మూసివేసిన అధికారులు.. ఆ తర్వాత జామా మసీద్, దిల్షద్ గార్డెన్, జిల్మిల్, మానసరోవర్ పార్కు, ఇంద్రప్రస్థ తదితర స్టేషన్లను మూసివేశారు.
పరిణామాలపై అమిత్ షా ఆరా
దిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. నగరంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న వేళ తాజా పరిస్థితులపై అధికారులతో చర్చించారు. ఈ రోజు ఉదయం నుంచి జరిగిన పరిణామాలను అధికారులు ఆయనకు వివరించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.
నంగ్లోయ్ వద్ద ఉద్రిక్తత
నంగ్లోయ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ట్రాక్టర్లపై వస్తున్న అన్నదాతలపై భాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు వారిని చెదరగొట్టారు.
పార్లమెంట్, రాజ్పథ్ వైపు వెళ్లే మార్గాలు మూసివేత
మరోవైపు, పార్లమెంట్, విజయ్ చౌక్, రాజ్పథ్, ఇండియా గేట్ వైపు వెళ్లే మార్గాలను పోలీసులు మూసివేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. కొన్ని ప్రధాన మార్గాలు మూసివేయడంతో ఇతర మార్గాల్లో భారీగా రద్దీ నెలకొంది.
సంయమనం పాటించండి: పోలీసుల విజ్ఞప్తి
సాగు చట్టాలను కేంద్రం రద్దుచేయాలని పట్టుబడుతూ ఆందోళనకారులు ఎర్రకోట ప్రాంగణంలో నినాదాలు చేస్తున్నారు. దీంతో అక్కడి నుంచి రైతులను ఖాళీ చేయించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఆందోళనకారులను నియంత్రించేందుకు లాఠీఛార్జితో పాటు భాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు రైతులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రశాంతంగా ర్యాలీ నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు. అనుమతించిన మార్గాల్లో పరేడ్ నిర్వహించుకోవాలని పోలీసులు పేర్కొన్నారు.
ఇవీ చదవండి..
ర్యాలీలోకి ఇతరులు చొరబడ్డారు: తికాయత్
ఉద్రిక్తతల నడుమ..కొనసాగుతోన్న ట్రాక్టర్ పరేడ్!