
తాజా వార్తలు
పింక్బాల్ టెస్టులో తప్పు చేశాం: జోరూట్
ఇంటర్నెట్డెస్క్: అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ముగ్గురు పేసర్లను తీసుకోవడానికి గల కారణాన్ని ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ వివరించాడు. పింక్బాల్ టెస్టులో తాము పరిస్థితుల్ని తప్పుగా అంచనా వేశామని అంగీకరించాడు. తాజాగా మీడియాతో మాట్లాడిన రూట్ నాలుగో టెస్టులో యువ స్పిన్నర్ డామ్ బెస్ను తుది జట్టులోకి తీసుకుంటామన్నాడు. ఈ సందర్భంగా పింక్బాల్ టెస్టుపై ఇలా స్పందించాడు.
‘మూడో టెస్టులాగే ఇప్పుడు కూడా పిచ్ అలాగే ఉంటే.. అవకాశం కోసం డామ్ బెస్ ఎదురుచూస్తుంటాడు. అయితే, నాలుగో టెస్టు తుది జాబితాలో అతడు కచ్చితంగా ఉంటాడు. అవకాశం వస్తే సద్వినియోగం చేసుకొని తన నైపుణ్యాన్ని ప్రదర్శించాలని ఆరాట పడుతున్నాడు. గత టెస్టులో నా బౌలింగ్ ప్రదర్శన(5/8) చూసి అతడెంతో ఉత్సుకతకు గురై ఉంటాడు. అలాగే నాకూ అతడికి పోలికలే లేవు. అతడు నా కన్నా ఎంతో నైపుణ్యం గల స్పిన్నర్’ అని రూట్ వివరించాడు.
‘ఇక పింక్బాల్ టెస్టులో మా జట్టు ఎంపికలో తప్పు జరిగింది. పిచ్ను అంచనావేయలేకపోయాం. గతంలో భారత్లో జరిగిన పింక్బాల్ టెస్టు పరిస్థితులను బట్టి, అక్కడ బంతి ఎలా స్పందించిందనే విషయాల పైనే ఈ మ్యాచ్లో తుది జట్టును ఎంపిక చేశాం. కానీ, బంతి ఇలా తిరుగుతుందని ఊహించలేదు’ అని ఇంగ్లాండ్ కెప్టెన్ అసలు విషయం వెల్లడించాడు. మరోవైపు నాలుగో టెస్టుకు ముందు మొతేరా పిచ్పై వ్యంగ్యంగా ఓ ఫొటో పంచుకున్న ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్వాన్కు టీమ్ఇండియా అభిమానులు దీటుగా జవాబిచ్చారు.
వాన్ ఓ మట్టి కుప్పలో బ్యాటింగ్ చేస్తున్నట్లు ఇన్స్టాలో ఫొటో పంచుకొని.. ‘నాలుగో టెస్టుకు బాగా సన్నద్ధమౌతున్నా’నని పోస్టు చేశాడు. దీనికి స్పందించిన నెటిజెన్లు.. ‘నువ్వెప్పుడూ ఏడుస్తూనే ఉండు’ అని కామెంట్లు పెడుతున్నారు. పింక్బాల్ టెస్టులో టీమ్ఇండియా గెలుపొందినప్పటి నుంచి వాన్ ఆ పిచ్పై విమర్శలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇలా చేసి నవ్వులపాలయ్యాడు.