
తాజా వార్తలు
పీపీఈ కిట్ ధరించి 25 కేజీల బంగారం స్వాహా!
దిల్లీ: కరోనా పరిస్థితుల నేపథ్యంలో పీపీఈ కిట్ల వాడకం బాగా పెరిగింది. ఆసుపత్రుల్లోనూ, జనసమ్మర్థ ప్రదేశాల్లో వీటిని ఎక్కువగా వాడుతున్నారు. ఫ్రంట్లైన్ వారియర్స్కు ప్రభుత్వమే వీటిని ఉచితంగా సరఫరా చేస్తోంది. అయితే, పీపీఈ కిట్లు ధరించి కొందరు దుండగులు దొంగతనాలకు పాల్పడటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దిల్లీలోని నగల దుకాణంలో ఓ వ్యక్తి పీపీఈ కిట్ ధరించి 25 కిలోల బంగారాన్ని చోరీ చేశాడు. ఆ సమయంలో అక్కడ సాయుధులైన ఐదుగురు భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ వారి కళ్లుగప్పి అపహరించుకుపోయాడు. తీరా సీసీటీవీ పుటేజీలు పరిశీలిస్తే దొంగ ఎంత చాకచక్యంగా తప్పించుకుపోయాడో తెలిసి ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. దొంగలించిన బంగారాన్ని ఆటోలో తరలించినట్లు గుర్తించామని, నిందితుడిని అరెస్టు చేశామని అధికారులు వెల్లడించారు. నిందితుడిని కర్ణాటకలోని హుబ్లీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం దక్షిణ దిల్లీలోని ఓ ఎలక్ట్రానిక్ దుకాణంలో పని చేస్తున్నాడని, పక్కా ప్రణాళిక ప్రకారమే దొంగ తనానికి పాల్పడ్డాడని తెలిపారు. నిందితుడు బుధవారం రాత్రి 9.30 సమయంలో దుకాణంలోకి ప్రవేశించి తెల్లవారు జామున 3 వరకు అక్కడే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇవీ చదవండి
సీరం సంస్థలో భారీ అగ్నిప్రమాదం
రెండో ప్రపంచ యుద్ధం కంటే ఎక్కువ