
తాజా వార్తలు
పోలింగ్ శాతం మరింత పెరిగితే బాగుండేది
ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్: తీవ్ర ఉత్కంఠ రేపిన జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘‘ పోలింగ్ శాతం మరింత పెరిగితే బాగుండేది. గత ఎన్నికల్లో 60 స్థానాల్లో పోటీ చేసి 44 స్థానాల్లో గెలిచాం. ఈ సారి 51 స్థానాల్లో పోటీ చేసి 44 స్థానాల్లో గెలుపొందాం. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న 44 డివిజన్లలో 34 వార్డుల్లో పోటీ చేసి 33 గెలుపొందాం. పురానాపూల్ నుంచి నాలుగోసారి గెలుపొందాం. ఇది మా పనితనానికి నిదర్శనం. భాజపా కూడా ఈసారి చాలా స్థానాల్లో గెలిచింది. రాబోయే రోజుల్లో ఆ పార్టీ మరింత ఎదగకుండా కృషి చేస్తాం. భాజపాకి లభించింది తాత్కాలిక విజయమే. మేయర్, డిప్యూటీ మేయర్ పదవి విషయంపై గెలుపొందిన కార్పొరేటర్లతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. పాతబస్తీపై మెరుపుదాడులు అంటే ప్రజలు డెమొక్రటిక్ దాడి చేశారు. కేరళ, అసోం రాష్ట్రాల్లో పోటీ చేయబోమని గతంలోనే ప్రకటించాము. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. రోహింగ్యా, జిన్నా, సర్జికల్ స్ట్రైక్ అన్న ఆరోపణలను ప్రజలు తిప్పి కొట్టారు. నా ప్రయాణానికి ఎవరి వాహనం అవసరం లేదు. నాకు ఎవరి సహకారం అవసరం లేదు. నేను స్వయంగా 65 సభల్లో పాల్గొన్నాను. ఈ ఎన్నికల్లో తెరాస నష్టపోయింది నిజమే. రాజకీయ ఉద్దండుడు కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం’’ అని అసదుద్దీన్ పేర్కొన్నారు.