
తాజా వార్తలు
‘నారింజ మిఠాయి’ టీజర్ చూశారా?
హైదరాబాద్: ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలు ప్రస్తుతం వివిధ ఓటీటీల వేదికగా ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ తర్వాత అలా వస్తున్న సినిమాల సంఖ్య గణనీయంగా పెరిగింది. తాజాగా ఓ తమిళ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
సముద్రఖని, సునయన, మణికందన్, కె.నివేదితా సతీశ్ తదితరులు కీలక పాత్రల్లో హలిత షమీమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సిల్లు కరుప్పత్తి’. 2019 డిసెంబరులో విడుదలైన ఈ సినిమా అక్కడ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అంతేకాదు, విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. బెంగళూరు ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో తమిళ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో దీన్ని ప్రదర్శించారు.
కాగా, ఈ సినిమాను తెలుగులో ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ వేదికగా ‘నారింజ మిఠాయి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. జనవరి 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర టీజర్ను విడుదల చేశారు. కేవలం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో విడుదలైన టీజర్ చూస్తుంటే సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మరి ‘నారింజ మిఠాయి’ వెనుక కథ తెలియాలంటే సినిమా చూడాల్సిందే!