
తాజా వార్తలు
ప్లేటు బిర్యానీ.. రూ.20 వేలు.. ఎందుకంటే?
దుబాయి: బిర్యానీ అంటే లొట్టలేయనిది ఎవరు చెప్పండి.. మన దగ్గరే కాదు.. చాలా దేశాల్లో ఇది పాపులర్ ఫుడ్. సాధారణంగా ప్లేట్ బిర్యానీ ధర రూ. 100 నుంచి రూ. 1000 దాకా ఉంటుంది. అందులో ఉపయోగించే మాంస పదార్థాలను బట్టి ఈ ధర కాస్త అటూఇటూగా ఉంటుంది. కానీ దుబాయిలో దొరికే ఓ బిర్యానీ ధర దాదాపు రూ. 20వేలు. వామ్మో.. అని నోరెళ్లబెడుతున్నారా..! అవును మరి.. ఎందుకంటే అది ‘గోల్డ్’ బిర్యానీ.
దుబాయిలోని బాంబే బరో అనే భారతీయ రెస్టారెంట్ ‘రాయల్ గోల్డ్ బిర్యానీ’ పేరుతో బిర్యానీని విక్రయిస్తోంది. దీని ప్లేట్ ధర 1000 దిర్హామ్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 19,700. 23 కేరట్ల తినే బంగారంతో గార్నిష్ చేసి దీన్ని వడ్డిస్తారు. అందుకే దీనికి గోల్డ్ బిర్యానీ అని పేరుపెట్టారు. ఇదొక్కటే కాదు.. ఇందులో చాలా ప్రత్యేకతలున్నాయి.
సాధారణంగా బిర్యానీలో ఒకేరకంగా ఉండే అన్నం ఉంటుంది. కానీ ‘రాయల్ గోల్డ్..’లో విభిన్న రకాల అన్నాన్ని వడ్డిస్తారు. బిర్యానీ రైస్, కీమా రైస్, కుంకుమపువ్వుతో చేసిన అన్నం, తెల్లన్నంతో దీన్ని రెడీ చేస్తారు. దానిపై ఉడకబెట్టిన గుడ్లు, చిన్న బంగాళాదుంపలు, జీడిపప్పు, దానిమ్మ గింజలు తదితరవాటిని ఉంచుతారు. అన్నంపై కశ్మీరీ గొర్రె కబాబ్స్, ఓల్డ్ దిల్లీ కబాబ్స్, రాజ్ఫుత్ చికెన్ కబాబ్స్, మొఘలాయి కోఫ్తా వంటి మాంసం ముక్కలను పెట్టి వాటిపై 23 కేరట్ల తినే బంగారాన్ని అలంకరిస్తారు. బిర్యానీతో పాటు నిహారీ సలాన్, జోధ్పురి సలాన్, బాదామీ సాస్, రైతాను ఇస్తారు. ప్రపంచంలోనే ఇప్పటివరకు అత్యంత ఖరీదైన బిర్యానీ ఇదేనని రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు. దుబాయి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్లో ఉండే ఈ పాపులర్ రెస్టారెంట్కు భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు వస్తుంటారు.