
తాజా వార్తలు
ప్చ్..! పీవీ సింధుకు చుక్కెదురు
ఇంటర్నెట్డెస్క్: సుదీర్ఘ విరామం అనంతరం ఆడుతున్న తొలి అంతర్జాతీయ టోర్నీలో ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధుకు చుక్కెదురైంది. యోనెక్స్ థాయిలాండ్ ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. మహిళల సింగిల్స్లో డెన్మార్క్ షట్లర్ మియా బ్లిక్ఫీల్డ్ చేతితో 21-16, 24-26, 13-21 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. తొలి గేమ్లో ప్రత్యర్థిపై పైచేయి సాధించిన సింధు రెండో గేమ్లో ఓటమిపాలైంది. అయితే పోటాపోటీగా సాగిన రెండో గేమ్ ఆదిలో సింధుదే ఆధిపత్యం. కానీ బ్లిక్ఫీల్డ్ పుంజుకుని మ్యాచ్ను మూడో గేమ్కు తీసుకువచ్చింది. ఆఖరి గేమ్లో జోరును కొనసాగిస్తూ బ్లిక్ఫీల్డ్ మ్యాచ్ను సొంతం చేసుకుంది.
మరోవైపు పురుషుల సింగిల్స్లో భారత షట్లర్ సాయి ప్రణీత్ కూడా తొలిరౌండ్లోనే నిష్క్రమించాడు. స్థానిక ఆటగాడు వాంగ్చరొయిన్ చేతిలో 16-21, 10-21 తేడాతో ఘోరపరాజయాన్ని చవిచూశాడు. ప్రత్యర్థి ఆధిపత్యం చెలాయించడంతో మ్యాచ్ 40 నిమిషాల్లోపే ముగిసింది. కాగా, మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్- అశ్విన్ పొన్నప్ప విజయకేతనం ఎగురవేశారు. 21-11, 27-29, 21-16 తేడాతో ప్రత్యర్థి జోడీని చిత్తుచేశారు. అయితే థాయిలాండ్ ఓపెన్లో ఆడాల్సిన భారత అగ్రశ్రేణి క్రీడాకారులు సైనా నెహ్వాల్, కశ్యప్, హెచ్ఎస్ ప్రణయ్ మ్యాచ్లకు దూరమయ్యారు. కరోనా పాజిటివ్ అని తేలడంతో సైనా, ప్రణయ్ టోర్నీ నుంచి వైదొలగగా, కశ్యప్ క్వారంటైన్లో ఉన్నాడు.
ఇదీ చదవండి
సైనాకు మరోసారి కరోనా పాజిటివ్
‘డ్రా’ కానే కాదిది.. ఆసీస్ పొగరుకు ఓటమి!