
తాజా వార్తలు
కస్టమర్లలా వచ్చి.. 5 నిమిషాల్లో చోరీ
(ప్రతీకాత్మక చిత్రం)
ముంబయి: దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. వినియోగదారుల్లా ఓ నగల దుకాణానికి వెళ్లి తుపాకులతో బెదిరించి చోరీకి పాల్పడ్డారు. కేవలం అయిదే నిమిషాల్లో నగలన్నీ ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మీరా రోడ్డులోని శాంతినగర్ ప్రాంతంలోని ఎస్ కుమార్ జువెల్లరీ దుకాణానికి గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నలుగురు వ్యక్తులు వచ్చారు. కస్టమర్లమని చెప్పి నగలు చూపించమని అడిగారు. సేల్స్ సిబ్బంది నగలను బయటకు తీసిన వెంటనే దుండగుల్లో ఒకడు తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో సిబ్బంది, ఇతర కస్టమర్లు భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే ఆభరణాలను తీసుకుని దొంగలు అక్కడి నుంచి ఉడాయించారు. కేవలం అయిదే నిమిషాల్లో దుండగులు చోరీ చేశారని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే దొంగలు ఎత్తుకెళ్లిన నగల విలువ ఎంత అనేది పోలీసులు వెల్లడించలేదు.
ఇవీ చదవండి..