
తాజా వార్తలు
నిర్మాతలుగానూ వీళ్లు హీరోలే..!
సత్తా చాటుకుంటున్న టాలీవుడ్ నటులు
వరుస సినిమాలతో బిజీగా ఉండే టాలీవుడ్ హీరోలు నిర్మాణ రంగంపై తమదైన ముద్రవేస్తున్నారు. అటు హీరోలుగా సినిమాల్లో నటిస్తూనే ఇటు నిర్మాతలుగా మారి తమ అదృష్టాన్ని పరిక్షీంచుకుంటూ ప్రేక్షకులకు విభిన్నమైన చిత్రాలను అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ అగ్ర, యువ హీరోలు నిర్మాతలుగా మారి మంచి విజయాలను అందుకోగా మరికొందరు నిర్మాతలుగా తమని తాము నిరూపించుకునేందుకు సన్నద్ధమవతున్నారు. మరి నిర్మాతలుగా మారిన హీరోలపై ఓ లుక్కేయండి!
తండ్రి హీరోగా తనయుడు నిర్మాతగా..
‘ఖైదీ నంబర్ 150’ చిత్రంతో వెండితెరకు రీఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంతో రామ్చరణ్ నిర్మాతగా మొదటి అడుగు వేశారు. దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.170 కోట్లకు పైగా వసూలు చేసిందని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. చిరంజీవి కథానాయకుడిగా గతేడాది విడుదలైన ‘సైరా’ చిత్రానికి కూడా చెర్రీనే నిర్మాతగా వ్యవహరించారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రానికి రామ్చరణ్ దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్ను పెట్టారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి చిరు-కొరటాల శివ మూవీ ‘ఆచార్య’ చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
‘శ్రీమంతుడు’తో మొదలు పెట్టి..
‘శ్రీమంతుడు’ చిత్రంతో నిర్మాతగా తొలి అడుగు వేశారు సూపర్స్టార్ మహేశ్ బాబు. GMB ఎంటర్టైన్మెంట్ (ఘట్టమనేని మహేశ్బాబు ఎంటర్టైన్మెంట్) పతాకంపై తెరకెక్కిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘బ్రహ్మోత్సవం’ నిర్మాతగా మహేశ్కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇటీవల విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’తో కథానాయకుడిగానే కాకుండా నిర్మాతగానూ బ్లాక్బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మరోవైపు అడివి శేష్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘మేజర్’ చిత్రానికి కూడా మహేశ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
యువ దర్శకులను ప్రోత్సహించేందుకు..
విభిన్నకథా చిత్రంగా తెరకెక్కి ‘అ!’తో నిర్మాతగా మారారు ‘నేచురల్ స్టార్’ నాని. వాల్ పోస్టర్ సినిమా పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి తొలి ప్రయత్నంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమాని నిర్మించారు. కాజల్, రెజీనా, నిత్యామేనన్, అవసరాల శ్రీనివాస్ కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ మేకప్ విభాగాల్లో జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. విశ్వక్సేన్ కథానాయకుడిగా నటించిన ‘హిట్’ సినిమాతో ఈ ఏడాది నిర్మాతగా నాని మంచి విజయాన్ని అందుకున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి నెలలో విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. ‘కొన్ని కథలు చాలా బాగుంటాయి. అయితే, అవి నా బాడీ లాంగ్వేజ్కు సరిపోకపోవచ్చు. అలాంటి మంచి కథలతో వచ్చే యువ దర్శకులను ప్రోత్సహించడానికి నేను ముందుంటా’ అని ఇటీవల ‘హిట్’ ప్రమోషన్స్లో చెప్పుకొచ్చారు నాని.
సరికొత్త ప్రయత్నం..
‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో అభిమానుల రౌడీగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా నటించిన ‘నోటా’ సినిమా విడుదల సమయంలో ‘కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్’ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రకటించారు. అలా ఆయన ‘మీకు మాత్రమే చెప్తా’ చిత్రంతో నిర్మాతగా తొలి అడుగు వేశారు. ‘పెళ్లి చూపులు’ చిత్రంతో తనని హీరోగా పరిచయం చేసిన తరుణ్ భాస్కర్ను కథానాయకుడిగా పరిచయం చేశారు. సరికొత్త ప్రయత్నంగా సినిమా అలరించింది.
రీఎంట్రీతో రెండు బాధ్యతలు..
‘అహం బ్రహ్మస్మి’ సినిమాతో వెండితెరపై రీఎంట్రీ ఇస్తున్నారు కథానాయకుడు మంచు మనోజ్. ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా తర్వాత దాదాపు మూడేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన గతేడాది ఎంఎం ఆర్ట్స్ పేరుతో కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘అహం బ్రహ్మస్మి’ చిత్రాన్నిఈ బ్యానర్పైనే మంచు నిర్మలా దేవి, మంచు మనోజ్ నిర్మిస్తున్నారు. కొత్త టాలెంట్ను ప్రోత్సహించడం కోసం ఎంఎంఆర్ట్స్ బ్యానర్ను ఏర్పాటు చేసినట్లు మంచు మనోజ్ తెలిపారు.
కథ నచ్చితే...
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు అగ్ర కథానాయకుడు నాగార్జున. తాను నటించే సినిమాలే కాకుండా తన తనయులకు సంబంధించిన చిత్రాలకు కూడా నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాదు, కథాబలమున్న ‘నిర్మలా కాన్వెంట్’, ‘ఉయ్యాల జంపాలా’ చిత్రాలను నిర్మించి మంచి విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం నాగ్ ‘వైల్డ్డాగ్’ చిత్రంతో పాటు బాలీవుడ్లో తెరకెక్కుతోన్న ‘బ్రహ్మస్త్ర’ చిత్రంలో కూడా నటిస్తున్నారు.
తనకోసమే కాదు.. తమ్ముడి కోసం కూడా..
‘అతనొక్కడే’ సినిమాతో కల్యాణ్రామ్ హీరోగానే కాకుండా నిర్మాతగాను మంచి విజయాన్ని అందుకున్నారు. యన్.టి.ఆర్ ఆర్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి తన సినిమాలతోపాటు ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ‘జైలవకుశ’ చిత్రాన్ని కూడా కల్యాణ్రామ్ నిర్మించారు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో నటించిన ‘జై లవకుశ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకి కూడా కల్యాణ్రామ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు.
అభిరుచి గల నటుడు..
‘బొమ్మలాట’.. విభిన్న కథతో తెరకెక్కిన ఈ చిత్రానికి రానా సహ నిర్మాతగా వ్యవహరించారు. 2004లో విడుదలైన ఈ సినిమా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. వెంకటేశ్ మహ దర్శకత్వం వహించిన ‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రానికి రానా సమర్పకుడిగా మారారు. 2018లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలను అందుకుంది. న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్లలో సైతం ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఆ ఏడాదికిగానూ పలు విభాగాల్లో ఫిలింఫేర్ అవార్డులను సైతం ‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రం కైవసం చేసుకుంది. దీనితోపాటు బుల్లితెరలో ప్రసారమయ్యే ‘నెం1 యారీ’ షోకి కూడా రానా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
అన్నీ తానై...
‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘నాన్’ సినిమా నుంచి విజయ్ ఆంటోనీ నిర్మాతగా మారారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై తాను కథానాయకుడిగా తెరకెక్కిన ప్రతి సినిమాకు విజయ ఆంటోనీనే నిర్మాతగా వ్యవహరించారు. నిర్మాతగానే కాకుండా తన సినిమాలకు విజయ్ మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్గా కూడా పనిచేశారు.
త్రిపాత్రాభినయం..
‘పల్నాడు’ చిత్రంతో నిర్మాతగా మారారు కోలీవుడ్ నటుడు విశాల్. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పేరుతో 2013లో నిర్మాణ సంస్థను స్థాపించి.. తాను కథానాయకుడిగా నటించిన ‘పందెంకోడి 2’, ‘డిటెక్టివ్’ లాంటి చిత్రాలను విశాల్ నిర్మించారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘డిటెక్టివ్ 2’. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్పై తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి విశాల్ నటుడిగా, నిర్మాతగానే కాకుండా దర్శకుడిగాను పనిచేస్తున్నారు. అంటే విశాల్ త్రిపాత్రాభినయం చేస్తున్నారన్నమాట!
దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్కు చెందిన పలువురు స్టార్ హీరోలు సైతం నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సల్మాన్ఖాన్కు సల్మాన్ఖాన్ ఫిల్మ్స్, షారుక్కు రెడ్ చిల్లీస్, అక్షయ్ కుమార్కు హరి ఓమ్ ఎంటర్టైన్మెంట్, బిగ్బికి అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ పేరుతో నిర్మాణ సంస్థలు ఉన్నాయి.