
తాజా వార్తలు
‘అయోధ్య రామమందిరానికి విరాళాలు ఇవ్వొద్దు’
కోరుట్ల ఎమ్మెల్యే కె.విద్యాసాగర్రావు వ్యాఖ్య
ధరూర్ క్యాంప్ (జగిత్యాల): అయోధ్యలో నిర్మించబోయే రామ మందిర నిర్మాణానికి ప్రజలెవరూ విరాళాలు ఇవ్వొద్దని కోరుట్ల ఎమ్మెల్యే కె.విద్యాసాగర్రావు కోరారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్తో కలిసి జగిత్యాలలో ఏర్పాటు చేసిన రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని దాదాపు ప్రతి గ్రామంలో రామాలయాలు ఉన్నాయని, ఇక్కడి ప్రజలెవరూ యూపీలో నిర్మించబోయే అయోధ్య రామమందిరానికి విరాళాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా భాజపాపై విమర్శలు గుప్పించారు.
‘‘ఎవరికీ చందాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. రామాలయం లేని గ్రామంలో చందాలు వేసుకొని గుడి నిర్మించుకోవాలి. అంతేకానీ ఎక్కడో నిర్మించే గుడికి ఇక్కడి వారు నిధులు ఇవ్వడమేంటి? రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి తదితర ఆలయాలకు నిధులు విడుదల చేసి నిర్మాణాలు చేపట్టింది. ఊహించని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలయాలను అభివృద్ధి చేస్తోంది. అలాగే యూపీ, కేంద్ర ప్రభుత్వాలు అయోధ్య రామమందిరానికి నిధులు విడుదల చేయాలి ’’ అని విద్యాసాగర్రావు వ్యాఖ్యానించారు. ‘‘హైదరాబాద్లో వరదలొస్తే ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. మీకు కూడా ప్రజలు ఓట్లేశారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురండి. అలా చేయకుండా రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాముడి పేరుమీద బయల్దేరారు’’ అంటూ భాజపా నేతలను ఉద్దేశించి ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నేతల మాయమాటలు నమ్మొద్దని ప్రజలకు సూచించారు.
ఇవీ చదవండి..
రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందో?లేదో?: భట్టి
ప్రభుత్వ అండతోనే విగ్రహాల ధ్వంసం: కన్నా