01/02/2023 16:00(IST)
అఖర్లో అమ్మకాల ఒత్తిడి.. గరిష్ఠాల నుంచి సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం మిశ్రమంగా ముగిశాయి. బడ్జెట్పై ఆశలతో ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన మార్కెట్లు బడ్జెట్ ప్రసంగం ఆసాంతం ఆ జోరును కొనసాగించాయి. ఓ దశలో సెన్సెక్స్ 1,200 పాయింట్లకు పైగా లాభపడింది. ఆదాయ పన్ను విధానంలో మార్పులు, మూలధన పెట్టుబడులకు కేటాయింపులు పెంచడం మదుపర్లను ఉత్సాహరించింది. కానీ, ఆ జోరు చివరి వరకు నిలవలేదు. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు కిందకు దిగొచ్చాయి.
☛ ఉదయం సెన్సెక్స్ (Sensex) 60,001.17 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 60,773.44- 58,816.84 మధ్య కదలాడింది. చివరకు 158.18 పాయింట్ల లాభంతో 59,708.08 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 17,811.60 వద్ద ట్రేడింగ్ ప్రారంభించి ఇంట్రాడేలో 17,972.20- 17,353.40 మధ్య ట్రేడయ్యింది. చివరకు 45.85 పాయింట్ల నష్టంతో 17,616.30 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.88 వద్ద నిలిచింది.