
తాజా వార్తలు
రైతుల ఆందోళన: అమిత్ షాతో తోమర్ భేటీ
దిల్లీ: దేశ రాజధాని సరిహద్దుల్లో రైతుల ఆందోళన తీవ్రమవుతున్న తరుణంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ ఉదయం షా నివాసానికి చేరుకున్న తోమర్ రైతుల నిరసనపై హోంమంత్రితో చర్చించారు. 12 గంటల్లో కేంద్రమంత్రులు భేటీ కావడం ఇది రెండోసారి. ఆదివారం రాత్రి భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, తోమర్ సమావేశమైన విషయం తెలిసిందే.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను కేంద్రం చర్చలకు ఆహ్వానించింది. అయితే సరిహద్దుల్లో ఉండకుండా దిల్లీ శివారులోని బురాడిలో ఉన్న మైదానానికి వెళ్లి ఆందోళన కొనసాగిస్తే వెంటనే చర్చలు జరుపుతామని అమిత్ షా సూచించారు. కాగా.. దీనిపై రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలు జరిపేందుకు షరతులు పెట్టడం అవమానకరమని విమర్శించారు. బురాడీకి వెళ్లేదే లేదని, సరిహద్దుల్లోనే చర్చలు జరగాలని తేల్చి చెప్పారు. లేదంటే దిల్లీకి చేరుకునే మొత్తం అయిదు రహదారులను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రులు హుటాహుటిన భేటీ అయ్యారు.
ఆందోళన నడుమే ప్రార్థనలు..
ఇదిలా ఉండగా.. ‘చలో దిల్లీ’ పేరుతో రైతులు చేపట్టిన ఆందోళన ఐదో రోజుకు చేరింది. దిల్లీ సరిహద్దుల్లోని సంఘ, టిక్రీ రహదారులపై వేలాది మంది రైతులు శాంతియుతంగా ఆందోళన సాగిస్తున్నారు. సోమవారం గురునానక్ జయంతిని పురస్కరించుకుని టిక్రి రహదారిపై పంజాబ్ రైతులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ప్రసాదాలు పంచుకున్నారు.