
తాజా వార్తలు
భారత్లో కరోనా: 649కేసులు, 13 మరణాలు
ఇంటర్నెట్ డెస్క్: భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే దేశంలోని 26రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ వైరస్ పాకింది. గురువారం నాటికి దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నిర్థారణ కేసుల సంఖ్య 649కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. కొవిడ్-19కారణంగా ఇప్పటివరకు మొత్తం 13మంది మృతి చెందినట్లు ప్రకటించింది. మొత్తం బాధితుల్లో 43మంది కోలుకోగా 593మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్ర, కేరళలో కొవిడ్-19 తీవ్రత ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో అత్యధికంగా 124కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. వీరిలో ఒకరు కోలుకోగా మరో ముగ్గురు మరణించారు. కేరళలో ఈ కేసుల సంఖ్య 118కి చేరగా వీరిలో నలుగురు కోలుకున్నారు.
ఇక తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 41కి చేరగా వీరిలో ఒకరు కోలుకున్నారు. మొత్తం బాధితుల్లో పది మంది విదేశీయులే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 11కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. వీరిలో ఒకరు కోలుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మధ్యప్రదేశ్లో గురువారం మరో ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్-19 బాధితుల సంఖ్య 20కి చేరింది. పశ్చిమబెంగాల్ లో కరోనా కేసుల తీవ్రత పెరుగుతోంది. తాజాగా 66ఏళ్ల వ్యక్తికి కరోనా నిర్ధారణ కావడంతో ఈ కేసుల సంఖ్య 10కి చేరింది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో కరోనా కారణంగా ఒకరు మరణించారు. గోవాలో మూడు కరోనా వైరస్ కేసులు నిర్ధారణ అయినట్లు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్
వెల్లడించారు. కొవిడ్-19 నిర్ధారించిన వారిని ప్రత్యేక సంరక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నామని సావంత్ పేర్కొన్నారు.
కశ్మీర్లో తొలి కరోనా మరణం నమోదైంది. హైదర్పోరా గ్రామంలో కొవిడ్-19 కారణంగా 65ఏళ్ల వ్యక్తి మరణించినట్లు కశ్మీర్ వైద్య అధికారులు వెల్లడించారు. అనంతరం ఈ వ్యక్తి కుటుంబంలోని నలుగురికి కూడా వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలా సాయం చేస్తామని శ్రీనగర్ మేయర్ జునైద్ అజీం ట్విటర్లో వెల్లడించారు. ఈ సందర్భంగా వైద్యులు చేస్తున్న కృషిని కొనియాడారు.