
తాజా వార్తలు
మెలానియా ట్రంప్ నుంచి పుస్తకం?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ ఓ పుస్తకాన్ని ప్రచురించనున్నట్టు తెలుస్తోంది. ప్రథమ మహిళగా తన అనుభవాలను దానిలో వివరించనున్నారని అంటున్నారు. కాగా ఇందుకు అధ్యక్షుడు ట్రంప్ కూడా మద్దతు తెలుపుతున్నారట. ఓ ఆంగ్ల మీడియా కథనం ప్రకారం.. శ్వేతసౌధంలో తన జ్ఞాపకాలను గురించిన ఈ పుస్తకాన్ని ప్రచురించేందుకు వివిధ ప్రచురణ సంస్థలతో మెలానియా సమావేశమవుతున్నారు. ఈ లావాదేవీలో ఆమెకు భారీ మొత్తమే లభించనుందని పరిశీలకులు అంటున్నారు.
నిజానికి ప్రథమ మహిళను గురించి ‘మెలానియా అండ్ మీ’ పేరుతో ఓ పుస్తకం సెప్టెంబర్లోనే విడుదలైంది. దీని రచయిత్రి ఒకప్పటి మెలానియా ప్రాణ స్నేహితురాలు స్టీఫెన్ విన్స్టన్ వోకాఫ్. ఈమె మెలానియాను ఇరుకున పెట్టే విధంగా ట్రంప్ తొలి భార్య సంతానం ఇవాంకా ట్రంప్తో శత్రుత్వం తదితర వ్యక్తిగత విషయాలను దీనిలో బయటపెట్టింది. అంతేకాకుండా పలు వివాదాస్పద సంభాషణలున్న టేప్లను కూడా విడుదల చేసింది. ఐతే ఆయా అంశాలను తాను మాట్లాడిన సందర్భమే వేరంటూ మెలానియా తోసిపుచ్చారు. ఆ పుస్తకం విడుదలైన అనంతరం రచయిత్రి స్టీఫెన్ విన్స్టన్పై మెలానియా విరుచుకుపడ్డారు. రచియిత్రి స్టీఫెన్ పేరు ప్రఖ్యాతుల కోసం తనతో స్నేహం నటించిందని.. ఆమె నిజాయితీ లేని అవకాశవాది అని దుమ్మెత్తిపోశారు.
ఇక అధ్యక్షుడు ట్రంప్ బంధువు మేరీ ఎల్ ట్రంప్ తన పుస్తకం ‘‘టూ మచ్ అండ్ నెవర్ ఇనఫ్’’లో అధ్యక్షుడిని విమర్శిస్తూ అనేక వివాదాస్పద విషయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ట్రంప్ కూడా తన పదవీకాలంలో విశేషాలను గురించిన 100 మిలియన్ డాలర్ల టీవీ, పుస్తక ఒప్పందాలు కుదుర్చుకున్నారని తెలిసింది. ఇక ఇటీవలే విడుదలైన మాజీ ప్రథమ పౌరుడు బరాక్ ఒబామా రచన ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’, ఆయన భార్య మిచెల్లె ఒబామా 2018లో ప్రచురించిన ‘బికమింగ్’ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి.