
తాజా వార్తలు
‘ఆయన అనారోగ్యానికి టీకాతో సంబంధం లేదు’
కొవిషీల్డ్ వ్యాక్సిన్ సురక్షితమని స్పష్టం చేసిన సీరం
దిల్లీ: ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకాతో కలిసి తాము రూపొందించిన కరోనా టీకా ‘కొవిషీల్డ్’ సురక్షితమైనదని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) స్పష్టం చేసింది. వైరస్ను ఎదుర్కోవడంలో సమర్థంగా పనిచేస్తుందని వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ ప్రయోగాల్లో పాల్గొన్న ఓ వాలంటీరులో తలెత్తిన అనారోగ్యానికి టీకాతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
‘‘కొవిషీల్డ్ వ్యాక్సిన్ సురక్షితమైంది. వైరస్ను సమర్థంగా ఎదుర్కొంటుంది. చెన్నైకు చెందిన వాలంటీరులో అనారోగ్య సమస్యలు రావడం దురదృష్టకరం. కానీ ఆయన అనారోగ్యానికి టీకాతో ఎలాంటి సంబంధం లేదు. వ్యాక్సిన్ ప్రయోగాలల్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. తాజా సంఘటనకు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులు, పరిశోధకులకు తెలియజేశాం. వారు కూడా ఆయన అనారోగ్యానికి టీకాతో ఎలాంటి సంబంధం లేదని ధ్రువీకరించారు’’ అని సీరం ఇన్స్టిట్యూట్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. డీసీజీఐకి కూడా వివరాలను అందజేసినట్లు తెలిపింది.
టీకా సురక్షితమైంది కాకపోయినా.. కరోనాపై ప్రభావం చూపకపోయినా.. వ్యాక్సిన్ను ప్రజా వినియోగానికి అందుబాటులోకి తీసుకురాబోమని సీరం ఇన్స్టిట్యూట్ స్పష్టం చేసింది. కంపెనీపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని తెలిపింది. సంస్థ ప్రతిష్ఠను దిగజార్చి ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయోద్దని కోరింది. దురుద్దేశంతో వాలంటీరు అసత్య ప్రచారాలు చేసినందుకే రూ.100 కోట్లు దావా వేస్తామని తెలిపినట్లు పేర్కొంది.
‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్ వల్ల తన ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడిందని క్లినికల్ ప్రయోగాల్లో పాల్గొన్న ఓ వాలంటీరు ఆరోపించిన విషయం తెలిసిందే. టీకా తీసుకున్న తర్వాత వాలంటీరులో మెదడు సంబంధిత సమస్యలు తలెత్తాయని ఓ బిజినెస్ కన్సల్టెంట్ ద్వారా సీరం ఇన్స్టిట్యూట్, ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్కు నోటీసులు పంపారు. ఈ ఆరోపణల్ని సీరం వెంటనే ఖండించింది.
ఇదీ చదవండి..
కొవిషీల్డ్ టీకాపై దుమారం